అమీర్పేట్ : నిరుపేదల ప్రయోజనాల కోసం అవసరమైతే ప్రభుత్వ స్థలాలను వినియోగించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్లోని తన ఛాంబర్లో హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, మేడ్చల్ కలెక్టర్ హరీష్లతో సమావేశమై సనత్నగర్ నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గం రాంగోపాల్పేట్ డివిజన్ పరిధిలోని వెంగళ్రావునగర్, సనత్నగర్ డివిజన్ పరిధిలోని శ్యామలకుంట బస్తీల్లో దశాబ్దాల కాలంగా నిరుపేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, వారికి అదే ప్రాంతంలో డబుల్ బెడ్రూంలు నిర్మించి ఇచ్చేందుకు వీలైన అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
అనంతరం ఇరు జిల్లాల కలెక్టర్లతో కలిసి బేగంపేట్లోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ పర్యటనలో సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.