మన్సూరాబాద్ : నిరుపేదల ఇండ్లలో జరిగే వివాహాలకు ఉప్పల ఫౌండేషన్ అపన్న హస్తం అందించింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గత ఇరవై సంవత్సరాలుగా ఉప్పల ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదల ఇండ్లలో జరిగే వివాహాలకు తన వంతు సహకారం అందిస్తూ ఆధరాభిమానాలను పొందుతున్నారు.
నాగోల్ లోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో రెండు కుటుంబాలలో జరిగే వివాహాలకు ఆయన సహకారం అందించారు. హయత్నగర్ మండలం కోతులాపురం గ్రామానికి చెందిన గోగు బాలమణి, బాలరాజ్ యాదవ్ దంపతుల కుమార్తె దీపిక వివాహానికి అండగా నిలిచారు.
అలాగే సిద్ధిపేట జిల్లా, నారాయణరావు పేట బంజేరుపల్లి గ్రామానికి చెందిన రోమాల బాలు, అమృత దంపతుల కుమార్తె దివ్య వివాహానికి గాను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తన సతీమణి ఉప్పల స్వప్నతో కలిసి చేయూతనందించారు.
రెండు కుటుంబాలకు చెందిన పెద్దలకు పుస్తె, మట్టెలు, చీర, గాజులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ అడ్వయిజర్ కమిటీ సభ్యులు మణిమాల, అనిత, శిరీష తదితరులు పాల్గొన్నారు.