పహాడీషరీఫ్ : మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని, ప్రజల కోసమే పుట్టిన టీఆర్ఎస్ పార్టీని గుండెల్లో పెట్టుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షాహీన్నగర్ ప్యారడైజ్ పంక్షన్హాల్లో టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎర్రకుంట నుంచి వాది దా వరకు టీఆర్ఎస్ నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.
అనంతరం సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ జల్పల్లి పెద్ద చెరువును బ్యూటీపికేషన్ చేయిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు రూ. 9.60 కోట్లు నిధులు విడదల అయ్యాయన్నారు. ఉస్మాన్నగర్ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. రెండు ఎకరాలలో షాదీఖాన నిర్మిస్తామన్నారు.
జల్పల్లి మున్సిపాలిటీ సిటికి దగ్గరగా ఉండి కూడా డ్రైనేజీ, రోడ్ల సమస్యలు అధికంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా తనతో మాట్లాడారని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 10 కోట్లు నిధులు విడుదల అయ్యాయన్నారు. టెండర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
తాగు నీటి కోసం రిజర్వాయర్ల నిర్మాణం కోసం, పైపులైన్ పనుల ఏర్పాటు కోసం నియోజకవర్గానికి రూ. 210 కోట్లు కేటాయిస్తే, జల్పల్లి మున్సిపాలిటీకి రూ. 30 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. మైనార్టీ విద్యార్థుల కోసం అనేక గురుకుల పాఠశాలలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
ఇస్లామిక్ కల్చర్ కన్వెక్షన్ సెంటర్ నిర్మాణం కోసం కోకాపేటలో 10 ఎకరాల స్థలం కేటాయించిందన్నారు. త్వరలో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఎర్రకుంటలో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేశామన్నారు. మున్సిపాలటీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.
జల్పల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ నూతన కమిటీ నియామక పత్రాలను కమిటీ సభ్యులకు అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నారు.