‘స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం నల్లేరు మీద నడక కానున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా మరోమారు బాసటగా నిలిచింది. విజ్ఞులైన ఓటర్లు కాంగ్రెస్ కుట్రలను పటాపంచలు చేశారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే నేతలు నేరుగా బీ ఫామ్ ఇవ్వకుండా అభ్యర్థిని నిలబెట్టడమే అందుకు నిదర్శనం. అటువంటి వాళ్ల కుయుక్తులతోనే కాంగ్రెస్కు కంచుకోటలు అనుకున్నవి కాస్తా మంచు కోటల్లా కరిగిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి తిరుగులేదు. పరుగులు పెడుతున్న ప్రగతిని చూసి రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే కరెక్ట్ అని భావించి రాజకీయాలకు అతీతంగా టీఆర్ఎస్కు ఓటు వేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు నడుమ మొత్తం 8 కేంద్రాల్లో ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తొలి రెండు గంటల్లో ఓటర్లు రాలేదు. 10గంటల వరకు కేవలం 1.57శాతమే పోలింగ్ నమోదైంది. తర్వాత రెండు గంటల్లో మాత్రం ఓటర్లు బారులుదీరారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 42.88శాతం ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత రెండు గంటలు కూడా పోలింగ్ ఇదే విధంగా కొనసాగింది. మధ్యాహ్నం 2గంటలకు 83.63శాతం పోలింగ్ నమోదైంది. చివరి రెండు గంటల్లోనూ అదనంగా మరో 13శాతం నమోదైంది. సాయంత్రం 4గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 97.01శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు దాదాపు టీఆర్ఎస్కు చెందిన ఓటర్లే పోలింగ్ కేంద్రాల్లో కనిపించారు. ఇక చివర్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఓటర్లు వచ్చినట్లు తెలిసింది. నల్లగొండ కేంద్రంలో 97.44శాతం, మిర్యాలగూడలో 98.95శాతం, దేవరకొండలో 97.85శాతం, సూర్యాపేటలో 98.38శాతం, కోదాడలో 95.69శాతం, హుజూర్నగర్లో 95.93శాతం, భువనగిరిలో 100శాతం, చౌటుప్పల్లో 85.84శాతం పోలింగ్ నమోదైంది.
ఏకపక్షంగా పోలింగ్ సరళి..
ఓటింగ్ ఏకపక్షంగా కొనసాగినట్లు పోలింగ్ సరళి స్పష్టం చేస్తున్నది. కేవలం టీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధుల హడావుడి కనిపించింది. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో సాగిన ఎన్నికల వ్యూహంలో పార్టీ ముఖ్యులంతా పూర్తి స్థాయిలో భాగస్వాములయ్యారు. నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ ఓటర్లందరితో పాటు తమ వెంట కలిసొచ్చిన విపక్ష ఓటర్లతో ఓటింగ్కు వెళ్లారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు దీనికి పూర్తి బాధ్యత తీసుకోవడంతో ఓటింగ్ ఏకపక్షంగా సాగేందుకు దోహదపడింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మొత్తం1,271 మంది ఓటర్లలో టీఆర్ఎస్కు 820 మంది ఓటర్లు ఉన్నట్లు ఆ పార్టీ లెక్కలు తేల్చింది. ఇక మిగిలిన వారిలో కాంగ్రెస్కు 384, బీజేపీకి 35, సీపీఎం 18, సీపీఐ 5, ఇతరులు 9 మంది ఉన్నారు. అయితే ఎవ్వరి సహకారం లేకుండానే టీఆర్ఎస్కు ఉన్న ఓట్లతోనే విజయం సునాయాసమనేది స్పష్టం. టీఆర్ఎస్ నేతలు కూడా తమ పార్టీ ఓటర్లందరితో దీనిపై ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి దిశానిర్దేశం చేశారు. ఇక పోలింగ్ రోజు మాత్రం టీఆర్ఎస్తో పాటు ఇతర పక్షాల ఓటర్లంతా కూడా ముందుకు వచ్చి గంపగుత్తగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికే ఓట్లు వేసినట్లు ట్రెండ్ కనిపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్లంతా తమ పార్టీ అగ్రనేతల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో 384 ఓట్లు ఉన్నా కనీసం అధికారికంగా అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో పాటు స్వతంత్ర అభ్యర్థుల్లోనూ ఎవ్వరికీ మద్దతు కూడా తెల్పలేకపోయారన్న చర్చ ఆ ఓటర్ల మధ్య సాగింది. ఇలాంటి నేతలతో ఏం లాభమన్న ధోరణిలో కాంగ్రెస్ పార్టీ ఓటర్లలో అసంతృప్తి నెలకొంది. సీపీఎం పార్టీ ఓటింగ్కు దూరంగా ఉంది. తమ పార్టీ ఓటర్లు ఓటింగ్లో పాల్గొనకుండా కట్టుదిట్టం చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలైన ప్రజాప్రతినిధులే ఓటింగ్లో పాల్గొనకపోవడం విస్మయానికి గురి చేసింది. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి జగదీశ్రెడ్డి రంగంలోకి దిగారు. జిల్లా అభివృద్ధి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమంటూ… కలిసి రావాలని విపక్ష ఓటర్లను కోరారు. దీనికి స్పందించిన విపక్ష ఓటర్లలో మెజార్టీ భాగం ఓటింగ్కు తరలివచ్చారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ ఓటర్లంతా అనూహ్యంగా ఓటింగ్లో పాల్గొన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి స్పందిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి భారీ మెజార్టీతో విజయదుందుబి మోగించబోతున్నారని ప్రకటించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో విపక్ష ఓటర్లు సైతం రాజకీయాలకు అతీతంగా కలిసిరావడం మంచి పరిణామమన్నారు. టీఆర్ఎస్కు ఓటేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మంత్రి జగదీశ్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఓటేసిన ప్రముఖులు..
ఈ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటర్లుగా మొత్తం 19 మంది ఉన్నారు. ఇందులో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేటలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇదే కేంద్రంలో జడ్పీ చైర్మన్ గుజ్జా దీపికా కూడా ఓటేశారు. నల్లగొండలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు తేరా చిన్నపరెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి ఓటు వేశారు. తమ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లతో ఎమ్మెల్యేలు పోలింగ్ కేంద్రాల్లోకి అడుగుపెట్టారు. హుజూర్నగర్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఓటు వేయగా కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. భువనగిరిలోని పోలింగ్ కేంద్రంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్కుమార్ తమ పార్టీ ఓటర్లతో కలిసి ఓటింగ్లో పాల్గొన్నారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, నోముల భగత్, దేవరకొండలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఓటు వేశారు. ఎక్స్అఫీషియో జాబితాలో హుజూర్నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, చౌటుప్పల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఇక సీపీఎం పార్టీ నిర్ణయంతో యూటీఎఫ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఓటింగ్ను బహిష్కరించారు.