వెంగళరావునగర్ :పదేండ్లుగా పుట్ పాత్ పైనే జీవనం సాగించారు పాపం ఆ వృద్ద దంపతులు. ఆకలిదప్పులతో అలమటిస్తూ.. నిలువ నీడలేని ఆ వయో వృద్దుల పట్ల పోలీసులు ఔదార్యం చూపారు. చుట్టుపక్కల వారిచ్చే మెతుకులతోనే ఇన్నాళ్లు బతుకుభారంగా గడుపుకొచ్చిన ఆ దంపతులకు వయోభారం మీద పడటంతో కదల్లేని.. మెదల్లేని నిస్సహాయస్థితికి చేరారు. పండుటాకుల బాధలను గమనించిన ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు చలించిపోయారు.
వృద్ద దంపతుల పట్ల మానవత్వాన్ని చూపారు. బోరబండ సైట్ త్రీలో రోడ్డుపక్కనే ఫుట్పాత్పై గత పదేండ్ల నుంచి వృద్ద దంపతులు యాచించి జీవనం సాగించేవారు. వయోభారం పెరగడంతో ఒంట్లో ఓపిక నశించింది. ఆరోగ్యం క్షీణించింది. యాచించడానికి కూడా నడవలేని స్థితికి చేరుకున్నారు.
ఏ దిక్కులేక దయనీయంగా గడుపుతున్న వీరి కష్టాలను స్థానికులు ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన వృద్ద దంపతులకు సేవ చేసే మేడిపల్లి లోని రాజమాతా స్వచ్చంద సేవాసంస్థవారికి సమాచారం అందించారు. వారిని ఒక ఆటోలో ఆశ్రమానికి తరలించి తన ఔదర్యాన్ని చాటుకున్నారు.