ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు, ఆ కళాశాలల అనుమతులు రద్దు చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయ కులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణకు విద్యార్థి నేతలు వినతిపత్రం అంద జేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాంనగర్లోని సన్ డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో వర్సిటీ నిబంధనలను తోసిరాజని వివిధ రకాల ఫీజూల నెపంతో విద్యార్థులపై విపరీత ఆర్థిక భారం మోపుతున్నారని మండిపడ్డారు.
తప్పుడు పత్రాలు, సమాచారంతో ఓయూ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలిని మోసం చేసి గుర్తింపు పొందిన ఈ కళాశాల యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో ల్యాబ్లు, లైబ్రెరీ లేకపోయినా, కార్ పార్కింగ్ స్థలాన్ని వాటికి కేటాయించినట్లు చూపుతున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ అనుమతి లేని అంతస్థులో తరగతులు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు.
ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోకుండా ఓయూ ఆడిట్ సెల్ అధికారులు మరో రెండు కోర్సు లుకు అనుమతులు ఇచ్చారన్నారు. వర్సిటీ అధికారులు వెంటనే తమ నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలని కోరారు. లేనిపక్షంలో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు దుబ్బ రంజిత్, రవినాయక్, సుధీర్, కరణ్, విజయ్కుమార్, సతీశ్, మధు, ఆంజనేయులు, నరేశ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.