వెంగళరావునగర్ : కార్పొరేట్ విద్యను సామాన్యులకు చేరువ చేసిన విద్యాదాత సూర్యనారాయణరాజు అని పలువురు వక్తలు కొనియాడారు. నలంద విద్యాసంస్థల వ్యవస్థాపక ఛైర్మన్ మంతెన సూర్యనారాయణరాజు ప్రథమ వర్ధంతి గురువారం వెంగళ్రావునగర్లోని నలంద కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీఎస్ జెన్కో సీఎండి ప్రభాకర్రావు, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణంరాజు, యశోద ఆసుపత్రి ఎం.డి జీ.ఎస్.రావు, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగాధర్, ప్రముఖ వైద్యులు డాక్టర్ శేషగిరిరావు తదితరులు దివంగత సూర్యనారాయణరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలంద విద్యాసంస్థల ద్వారా సామాజిక బాధ్యతగా ఆయన పేదలకు ఉచితంగా విద్యనందించారన్నారు. ఆర్ధిక సమస్యల కారణంగా నిరుపేద విద్యార్ధుల భవిష్యత్తు అంధకారం కారాదన్న మహోన్న తమైన ఆలోచనతో ఎంతో మందికి ఉచిత విద్యను అందిస్తూ ఆదర్శంగా నిలిచారని వారన్నారు. తండ్రి ఆశయాలను విద్యాసంస్థల ప్రస్తుత ఛైర్మన్ మంతెన శ్రీనివాసరాజు ఇప్పటికీ కొనసాగిస్తుండడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు సూర్యనారాయణ కశ్యప్, మంతెన సరస్వతమ్మ, ప్రముఖ వ్యాపారవేత్త దేవిరెడ్డి నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.