
ఖమ్మం, డిసెంబర్ 22: ఖమ్మం జిల్లాకు మరో ఘనత దకింది. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి మహిళా ముస్లిం ఐపీఎస్ను అందించిన కీర్తిని సొంతం చేసుకుంది. అంతే కాదు.. ఖమ్మం జిల్లా నుంచి కూడా తొలి మహిళా ఐపీఎస్ అధికారిని ప్రజాసేవకు పంపిన మరో ఘనత దక్కింది. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన నాన్ క్యాడర్ ఐపీఎస్ ఉద్యోగం ఖమ్మానికి చెందిన షేక్ సలీమా ఐపీఎస్గా ఉద్యోగం పొందారు. ఆమె స్వగ్రామం ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం. లాల్ బహదూర్, యాకూబ్ బీ దంపతుల మొదటి కుమార్తె ఈమె. తండ్రి ఖమ్మంలో ఎస్ఐగా పనిచేసి రిటైరయ్యారు. ఆమె విద్యాభ్యాసమంతా ఖమ్మంలోనే సాగింది. ప్రాథమిక విద్యాభ్యాం ప్రభుత్వ పాఠశాలలో, ఉన్నత విద్య ఖమ్మంలోని సెంచరీ స్కూల్లో, ఇంటర్ను ప్రతిభ కాలేజీలో, డిగ్రీని న్యూజనరేషన్ కళాశాలలో పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ చేశారు. గ్రూప్ ఉద్యోగాలకు ప్రిపేరై 2007లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్లో డీఎస్పీగా తొలి పోస్టింగ్ పొందారు. ఆ తరువాత అంబర్పేట పీటీసీ వైస్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. అడిషనల్ కమిషనర్ (అడ్మిన్)గా మాదాపూర్లో పనిచేశారు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్లో డీసీపీగా ఉన్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఐపీఎస్ల ఉద్యోగం జాబితాలో చోటు సంపాదించుకుని రాష్ట్రంలో తొలి మహిళా ముస్లిం ఐపీఎస్గా రికార్డు దకించుకున్నారు.
కుటుంబ సభ్యులందరూ ప్రయోజకులే…
సలీమా కుటుంబ సభ్యులందరూ ప్రయోజకులే. లాల్ బహదూర్, యాకూబ్ బీలకు నలుగురు సంతానం. ఈమె పెద్ద కుమార్తె. ఈమెకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక సోదరి జరీనా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ.. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ -1 పరీక్ష రాసి మెయిన్స్కు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలో అర్హత సాధిస్తే ఆమె కూడా ప్రభుత్వ సర్వీసుకు ఎంపికవుతారు. మరో చెల్లెలు మున్నీ కూడా ఎంపికై ఖైరతాబాద్ ఎంవీఐగా పనిచేస్తున్నారు. తమ్ముడు ఖాసిమ్ హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ వైద్యశాలలో వైద్యుడిగా స్థిరపడ్డారు. సలీమా భర్త కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. తమ కూతురు ఐపీఎస్గా ఎంపికవడం ప ట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.