బండ్లగూడ : నిరుపేదల ఆకలి తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఐదు రూపాయల భోజన పథకానికి విశేష ఆదరణ లభిస్తోందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరె మైసమ్మ దేవాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజన కేంద్రాన్ని మేయర్ మహేందర్రెడ్డి, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి, కమిషనర్ వేణుగోపాల్రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేద,బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతున్నారని వివరించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం కొనసాగుతోందని తెలిపారు. ప్రధానంగా రైతుల సంక్షేమానికి రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలను చేపట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు.
నిరాశ్రయులు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు గాను నగరంలో ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని ప్రవేశ పెట్టడంతో అనేక మంది నిరుపేదలకు ఉపయోగంగా మారుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేఎంసీ టీఆర్ఎస్ అద్యక్షుడు సురేష్ గౌడ్, నాయకులు సుమన్ గౌడ్, సహదేవ్ గౌడ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.