ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ లలితానగర్ అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. కాలనీలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలు పరిష్కరించడంతోపాటు సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. బుధవారం ఆయన లలితానగర్లో పర్యటించి స్థానికంగా చేపడుతున్న డ్రైనేజీ పైపులైన్ పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా లలితానగర్-జామై ఉస్మానియా మలుపులో గత రెండేళ్లుగా కొనసాగుతున్న మంచినీటి లీకేజీ సమస్యలను స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండపల్లి మాధవ్, శ్యామ్సుందర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన అధికారులను పిలిపించి లీకేజీకి మరమ్మత్తులు చేయించారు.
అదేవిధంగా స్థానికంగా పుట్పాత్పై ఉన్న మట్టికుప్పలను తొలగించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బి.శ్రీనివాస్ రెడ్డి , మాధవ్, శ్యామ్సుందర్, మల్లిఖార్జున్రెడ్డి, రాజు, రవియాదవ్, హరీష్, యాది తదితరులు పాల్గొన్నారు.