ఖమ్మం/ కొత్తగూడెం అర్బన్/ కూసుమంచి, జనవరి 7: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తుంటారు. అందుకు అనుగుణంగా వారి సంక్షేమం కోసం మౌలిక వసతులు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తుంటారు. అందువల్లనే ఉద్యోగులు, కార్మికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశ కార్యకర్తల కోసం తాజాగా మంచి నిర్ణయం తీసుకున్నారు. వీరందరికీ 30 శాతం పీఆర్సీని అమలు చేయాలని నిర్ణయించారు. 2020 జూన్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించారు. దీంతో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు, ఆశ వర్కర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని వేతనంతో బతుకు వెళ్లదీస్తున్న తమ జీవితాల్లో సీఎం వరాలు కురిపించారంటూ సంబురపడుతున్నారు. మున్సిపాలిటీల్లో ఏళ్ల తరబడి పనిచేసినప్పటికీ గత ప్రభుత్వాలన్నీ అరకొర వేతనాలే ఇచ్చాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే తమ బతుకులను అర్థం చేసుకుందని చెబుతున్నారు. రూ.8 వేలుగా ఉన్న తమ వేతనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.12 వేలకు పెంచారని, తాజాగా తమకు పీఆర్సీని అమలు చేస్తామని ప్రకటించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ వచ్చాకే జీతాలు పెరిగాయి..
నేను 17 ఏళ్లుగా మున్సిపాలిటీలో కాంట్రాక్టు వర్కర్గా పనిచేస్తున్నాను. తెలంగాణ రాకముందు అరకొర వేతనం వచ్చేది. దాంతోనే జీవితాన్ని గడిపేది. తెలంగాణ సిద్ధించాక రూ.8 వేలుగా ఉన్న వేతనాన్ని సీఎం కేసీఆర్ రూ.12 వేలకు పెంచారు. మళ్లీ ఇప్పుడు మాకు పీఆర్సీని వర్తింపజేస్తామని చెప్పారు. ఈ మాటతో మా ఆనందం రెట్టింపైంది.
-సలీం, మున్సిపల్ జవాన్, కొత్తగూడెం
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మాక్కూడా పీఆర్సీ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అది ఇప్పుడు అమలవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. 30 శాతం పీఆర్సీ అమలు చేస్తే మా జీతానికి రూ.3,000కు పైగా మాకు జమ అవుతుంది. గత ఏడాది జూన్ నుంచి అమలు చేస్తామని చెప్పడంతో మాకు రూ.20 వేలు ఖాతాలో పడతాయి.
-నవీన్, మున్సిపల్ జవాన్, కొత్తగూడెం
మాపై మరింత బాధ్యత పెరిగింది..
ఇతర ఉద్యోగులతో సమానంగా సీఎం కేసీఆర్ మా ఆశావర్కర్లకు కూడా 30 శాతం పీఆర్సీ ఇవ్వనుండడం ఎంతో సంతోషంగా ఉంది. వేతనాలు, పీఆర్సీ పెంచడంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. ఇకముందు మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. కొవిడ్ సమయంలో ఆశావర్కర్లమంతా కలిసి మా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి గ్రామానికీ వెళ్లి వైద్య సహాయం అందించాం.
-కొక్కిరేణి రమ, ఆశా వర్కర్, కూసుమంచి
వేతనం రూ.2,250 పెరిగింది..
గ్రామాల్లోని ప్రజలకు నిరంతరం ఆరోగ్య సహాయ సేవలు అందిస్తున్న మా ఆశావర్కర్లను ప్రభుత్వం గుర్తించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు 30 శాతం పీఆర్సీని అమలు చేస్తుండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. కొవిడ్ మొదలైనప్పటి నుంచీ వెనుకడుగు వేయకుండా పనిచేశాం. తాజా పీఆర్సీతో అదనంగా రూ.2,250 వేతనం పెరిగింది. దీంతో మొత్తం జీతం రూ.9,750 అయింది.
-విజయలక్ష్మి, ఆశా వర్కర్, కూసుమంచి
సంతోషంగా ఉంది..
సీఎం కేసీఆర్ మా వేతనాలు పెంచడంతోపాటు నాలాంటి కార్మికులకు పీఆర్సీ అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. పీఆర్సీ అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం. ప్రస్తుతం రూ.12 వేల వేతనం ఇస్తున్నారు. పీఆర్సీ కలిపితే అదనంగా రూ.3,400 వస్తాయి.
-మల్లెపాక వెంకటేశ్వర్లు, మున్సిపల్ కార్మికుడు, ఖమ్మం
అందరివాడు ముఖ్యమంత్రి కేసీఆర్
అన్ని వర్గాల ప్రజలు, కార్మికులకు న్యాయం చేస్తూ సీఎం కేసీఆర్ అందరివాడు, ఆరాధ్యుడు అయ్యారు. ఆయన చలువ వల్ల మా వేతనం, పీఆర్సీ పెరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకూ చాలీచాలని వేతనంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. పీఆర్సీ రావడంతో మరికొంత ఆసరా లభించింది.
-కందుల అక్కమ్మ, మున్సిపల్ కార్మికురాలు, ఖమ్మం