ఊట్కూర్, డిసెంబర్ 18 : మండలంలోని తిప్రాస్పల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు కూరగాయలు పండించి లాభాలు గడిస్తున్నారు. వానకాలంలో వరి పండించిన అధికశాతం రైతులు ప్రస్తుతం కూరగాయల సాగుపై దృష్టి సారించారు. గ్రామానికి చెందిన దాదాపు 30మంది రైతులు వివిధ రకాల కూరగాయల సాగుతో పెట్టుబడి పోను ఎకరాకు రూ. 60వేల నుంచి రూ.80వేల వరకు లాభాన్ని పొందుతున్నారు. కొద్దిపాటి నీటి వినియోగంతో అధిక దిగుబడి వస్తుండటంతో ఎక్కువ మంది ఈ సాగు వైపు మళ్లుతున్నారు. బీర, చిక్కుడు, ముల్లంగి, మిరప, టమాట, వంకాయ, గోరు చిక్కుడు, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, మెంతి, పుంటికూర తదితర ఆకు కూరలు, కూరగాయల పంటలు పండిస్తూ నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. లాభాలు ఆర్జిస్తున్నారు.
20ఏండ్లుగా పండిస్తున్నాం..
మాకు 15ఎకరాల పొలం ఉంది. 20ఏండ్లుగా కూరగాయలు పండిస్తున్నాను. ఎంఎస్సీ బీఈడీ పూర్తి చేశాను. ఉద్యోగం కోసం ఎదురు చూడలేదు. కూరగాయల సాగుతో ఉద్యోగం కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాను. మాకున్న పొలంలో ఒక ఎకరా ఉల్లిసాగు చేస్తున్నా. మరో 2ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నా. మార్కెట్లో కూరగాయాలకు మంచి డిమాండ్ ఉంది. రోజుకు రూ. 1000 నుంచి రూ.1500 వరకు అమ్మకం జరుగుతుంది. యాసంగిలో వరి పంటకు బదులు కూరగాయలు పండించడమే ఉత్తమం.
ఎకరాకు రూ.50వేల లాభం..
కూరగాయల సాగుకు ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి ఖర్చు అవుతుంది. పెట్టుబడిపోను రూ.50 వేల నుంచి రూ.60వేల వరకు లాభం వస్తుంది. 5ఏండ్ల నుంచి కూరగాయలు పండిస్తున్నా. పొలంలో అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలు సాగు చేశా. నారాయణపేట మార్కెట్లో హోల్సేల్గా అమ్ముతున్నాను. ఏడాది మొత్తం కూరగాయలు పండించి అమ్ముతున్నాను. పంటలకు తెగుళ్ల సమస్య ఉండదు. అధికారుల సలహాలు పాటిస్తున్నా.