సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 12: సిద్దిపేట జిల్లాలో వివిధ దశల్లో పనుల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసి నవంబర్ మొదటి వారంలోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పనపై రెవెన్యూ డివిజన్ అధికారులు, రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పర్యవేక్షణ, కార్యనిర్వాహక ఇంజినీర్లు, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లతో కలెక్టరేట్లో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని సిద్దిపేట రెవెన్యూ డివిజన్లో ఇప్పటికే 6,715 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గ్రౌండింగ్ కాగా, 5,555 ఇండ్లు పూర్తయ్యాయని, 1162 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు. గజ్వేల్ రెవెన్యూ డివిజన్లో ఇప్పటికే 3,175 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గ్రౌండింగ్ కాగా, 2,862 ఇండ్లు పూర్తయ్యాయని 313 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు. హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లో ఇప్పటికే 86 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గ్రౌండింగ్ కాగా, 72 ఇండ్లు పూర్తయ్యాయని, 14 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఇప్పటికే పలు ఇండ్లు పంపిణీ చేయగా, మిగతావి పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ప్రగతిలో ఉన్న ఇండ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాల్సి ఉందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీల్లో అన్ని మౌలిక వసతులు ఉండేలా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులన్నీ, లబ్ధిదారుల ఎంపిక నెలాఖరులోగా పారదర్శకంగా పూర్తిచేయాలన్నారు. సమావేశంలో గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజినీర్ చారి, పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజినీర్ కనకరత్నం, ఆర్డీవోలు జయచంద్రారెడ్డి, విజయేందర్రెడ్డి, అనంతరెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్, జిల్లా అధికారులు, ఇంజినీరింగ్ విభాగాల ఈఈ, డీఈఈలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీవోలు పాల్గొన్నారు.