ప్రజారోగ్య పరిరక్షణలో ముందుండి సేవలందిస్తున్న ఆశ కార్యకర్తలు, పట్టణ ప్రగతి, పారిశుధ్య నిర్వహణలో బాధ్యతగా పనిచేస్తున్న మున్సిపల్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి స్వరాష్ట్రంలో సమున్నత గౌరవం లభిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొచ్చిన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక భరోసాను అందిస్తున్నారు. తాజాగా 30 శాతం ఇన్సెంటివ్ను పెంచి, చిరుద్యోగుల కుటుంబాల్లో సంతోషం నింపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆశ కార్యకర్తలు 3,193 మంది, ఔట్ సోర్సింగ్ మున్సిపల్ సిబ్బంది 3,055 మంది ప్రయోజనం పొందనున్నారు. తాజా పెంపు మేరకు ఆశ వర్కర్లకు రూ.7200 నుంచి రూ.9,750కి, మున్సిపల్ సిబ్బందికి రూ.12 వేల నుంచి 15,600కి వేతనాలు పెరుగనున్నాయి. సమైక్య రాష్ట్రంలో కేవలం ప్రోత్సాహకాలతోనే గరిష్ఠంగా రూ.1,800 రాగా స్వరాష్ట్రంలో ఇప్పటికి మూడు సార్లు జీతాలు పెంచడంపై ఆశ కార్యకర్తలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞలు తెలిపారు.
సూర్యాపేట, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆశ కార్యకర్తలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రస్తుతం అందిస్తున్న వేతనానికి 30శాతం ఇన్సెంటివ్ ప్రకటించి వెంటనే అమలు చేయాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు పెంచిన ఇన్సెంటివ్ ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొం ది. ప్రస్తుతం ఆశలకు నెలకు రూ.7500 వేతనం ఇస్తుండగా ఇక నుంచి నెలకు రూ.9750 అందనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 3193మంది ఆశ కార్యకర్తలకు లబ్ధి చేకూరనుంది.
30శాతం ఇన్సెంటివ్ పెంపు
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక తొలుత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఇటీవల 30శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. అందులో భాగంగానే ఈ ఫిట్మెంట్ వర్తించని అంగన్వాడీలకు ఇప్పటికే వేతనం పెంచిన ప్రభుత్వం గురువారం ఆశ వర్కర్లకు సైతం 30శాతం ఇన్సెంటివ్ రూపంలో పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అందుతున్న రూ.7500కు తోడు మరో రూ.2250 జత చేసి మొత్తంగా నెలకు రూ.9750 ఇవ్వనుంది. అయితే ప్రభుత్వం పెంచిన ఈ ఇన్సెంటివ్ గతేడాది జూన్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
రూ.300నుంచి రూ.9750కి పెంపు
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు రూ.300గా ఉన్న ఆశ వర్కర్ల నెలవారీ వేతనం ఇప్పుడు రూ.9750 అయ్యింది. 2014ముందు కేసులను బట్టి ప్రతి ఆశకు కనిష్టంగా రూ.300నుండి గరిష్టంగా రూ.1500 వరకు అందేది. ఏండ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్న ఆశా వర్కర్లకు తొలి దశలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం వేతనం రూ.6వేలకు పెంచింది. అనంతరం కేసులతో సంబంధం లేకుండా ప్రతినెలా రూ.7500కు పెంచింది. ఇటీవల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం 30శాతం ఫిట్మెంట్ ఇవ్వటంతో తమకు సైతం ఇవ్వాలని ఆశలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఇస్తామని ప్రకటించిన సర్కార్ దీన్ని గతేడాది జూన్ నుంచి అమలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. పెరిగిన వేతనంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3193మందికి లబ్ధి చేకూరనుంది. జిల్లాల వారీగా సూర్యాపేటలో 1042మంది, నల్లగొండలో 1473మంది, యాదాద్రి జిల్లాలో 678మందికి లబ్ధి చేకూరనుంది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
మానవాళిపై మహమ్మారిగా మారిన కరోనా నియంత్రణతో పాటు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేసీఆర్ కిట్టు, కంటి వెలుగు వంటి పలు ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంలో ఆశా కార్యకర్తల కృషి ఎనలేనిది. గ్రామీణ స్థాయి ఏఎన్ఎంలకు చేదోడువాదోడుగా ఉంటూ అన్ని రకాల కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న ఆశ కార్యకర్తలను గుర్తించి పారితోషికం పెంచడం హర్షణీయం. ఇందుకు తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం తరపున సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావుతో పాటు పెంపునకు కృషి చేసిన జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ హామీ మేరకు ఈ పారితోషికం ఫిక్స్డ్ వేతనంగా వస్తుందనే ధీమా ఉంది.
సంతోషం వ్యక్తం చేస్తున్నాం
గ్రామాల్లో ఆశ వర్కర్లు చేస్తున్న పనిని ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ వచ్చాక మా జీతం మూడోసారి పెంచడం సంతోషంగా ఉంది. మొదట 6వేల నుంచి రూ.7,500, అనంతరం 9,750 పెంచిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ప్రభుత్వ నిర్ణయంతో సంతోషంగా ఉన్నాం.
మా కష్టాలను ప్రభుత్వం గుర్తించింది
నేను 2007సంవత్సరం నుంచి ఆశా వర్కర్గా సేవలందిస్తున్నా. కొన్నేళ్ల పాటు జీతాలు నాతాలు లేకుండే. సర్కారి ఆస్పత్రిలో డెలివరీ కేసులు చేయిస్తేనే ఒక్క కేసుకు రూ.100 నుంచి రూ.150 ఇచ్చేవారు. నెలకు మహా అంటే రూ.1500 వస్తే గగనం. ఆ పైసలతోనే కుటుంబం వెళ్లదీశా. టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో మా సేవలను గుర్తిస్తూ పారితోషికం రూ.6వేలు చేసింది. 2019లో 7,200, ప్రస్తుతం 9,750పెంపు హర్షణీయం. మేమంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
మా శ్రమను గుర్తించింది కేసీఆర్ సారే
మా శ్రమను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాక ముందు ఆశ వర్కర్ల వేతనం రూ.3 వేలు ఉండేది. రోజుకు కనీసం వంద రూపాయలు సైతం సక్రమంగా వచ్చేది కాదు. తెలంగాణ వచ్చాక మూడు దఫాలుగా పెంచి రూ.9750 పెంచడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
పనికి తగిన ఫలితం దక్కింది
కరోనా టీకాలు, గర్భిణుల డెలివరీకి సహాయ పడుతున్నా. అలాంటి రోజు వారీగా పూర్తి పని చేసినా ఫలితం అందలేదు. నేడు సీఎం కేసీఆర్ జీతాల పెంపుతో శ్రమకు తగ్గ ఫలితం అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. గ్రామాల్లో ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నందుకు ఆనందపడుతున్నాం.