ఒమిక్రాన్, కరోనాపై పోరుకు పాలమూరు జనరల్ దవాఖాన సిద్ధమైంది. పాజిటివ్ వ్యక్తులకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు,సిబ్బంది సన్నద్ధమయ్యారు. సకల సదుపాయాలతో దవాఖానలో వసతులు ఏర్పాటు చేశారు. తొలి ఆక్సిజన్ ప్లాంట్తోపాటు 500 పడకల ఆక్సిజన్ వార్డుతో 24 గంటల సేవలు అందించనున్నారు.60 ఆక్సిజన్ బెడ్లు.. 220 మంది వైద్యులు, 300 మందికిపైగా నర్సులు, 120 మంది పారిశుధ్య సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. కొవిడ్తోపాటు మిగతా రోగులకు అవసరమైన మందులు సిద్ధం చేశారు. రెండు వేవ్లను ఇప్పటికే విజయవంతంగాఎదుర్కొని ఉత్తమ వైద్యశాలగా పేరొందగా.. మూడో వేవ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని వైద్యులు తెలిపారు.
మహబూబ్నగర్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒమిక్రాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ జనరల్ దవాఖాన వైద్యులు అన్ని విధాలా సన్నద్ధమయ్యారు. రోజురోజుకూ దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దవాఖానల్లో అన్ని సౌకర్యాలు సమకూర్చారు. 500 పడకల ఆక్సిజన్ వార్డులో 24 గంటల వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 60 ఆక్సిజన్ బెడ్లు సైతం అందుబాటులో ఉన్నాయి. సుమారు 220 మంది వైద్యులు, 300 మందికిపైగా నర్సులు, 120 మంది పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. కొవిడ్తోపాటు ఇతర రోగులకు అవసరమైన మందులు సైతం సిద్ధంగా ఉంచారు. పైప్లైన్ ద్వారా పడకలకు ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.
3,076 మంది కొవిడ్ రోగులకు సేవలు..
కొవిడ్ తొలి రెండు వేవ్ల్లో రోగులు అల్లాడిపోయారు. డబ్బులు ఉన్నా ప్రైవేట్ దవాఖానల్లో బెడ్లు దొరకని సందర్భాలు చూశాం. లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. కానీ మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో పైసా ఖర్చు లేకుండా కొవిడ్ రోగులకు సేవలందించారు. 2020 మార్చి 23 నుంచి ఈ ఏడాది జనవరి 5వ తేదీ వరకు ఈ దవాఖానలో 84,683 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 10,842 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 3,076 మంది రోగులు జనరల్ దవాఖానలోనే చికిత్స తీసుకున్నారు. మిగతా వారిలో సింహభాగం హోం ఐసోలేషన్లో ఉన్నారు. కొవిడ్ అనుమానాలతో 79,565 మంది దవాఖానకు వచ్చి ఓపీ సేవలు పొందారు. కొవిడ్ కేర్ సెంటర్లో చేరిన వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సేవలతోపాటు మందులు అందించింది. దవాఖానలో ఉన్నన్ని రోజులు పౌష్టికాహారం అందించి త్వరగా కోలుకునేలా జాగ్రత్తలు తీసుకున్నది. మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో తొలిసారి జిల్లా స్థాయిలోని ఓ ప్రభుత్వ దవాఖానకు ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి రావడం ఇక్కడే. విజయవంతంగా సేవలందించిన కొవిడ్ ఇన్చార్జి డా.జీవన్ ఆధ్వర్యంలోని వైద్య సిబ్బంది మరోసారి సకల సదుపాయాలతో ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. వెంటిలేటర్లతో కూడిన 60 ఐసీయూ, 440 ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటికీ ఆక్సిజన్ అందించేందుకు ప్లాంట్ ఉన్నది. ఇక క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్ ద్వారా 50 ఐసీయూ బెడ్లు, 6 వెంటిలేటర్లు, ఇతర పరికరాలు సైతం సిద్ధంగా ఉంచారు. ఆర్టీపీసీఆర్ ద్వారా నిత్యం 300 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం ఉండగా.. ర్యాపిడ్ యాంటిజెన్ ద్వారా ఎంతమందికైనా పరీక్షలు చేయనున్నారు.
సొమ్ము చేసుకున్న ప్రైవేట్ దవాఖానలు..
రెండేండ్లుగా కరోనా భయాన్ని ప్రైవేట్ దవాఖానలు సొమ్ముచేసుకున్నాయి. బెడ్లు అందుబాటులో లేవని, ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉందని రోగులను భయాందోళనలకు గురిచేశారు. ఎలాగైనా తమకు బెడ్ ఇవ్వాలని, అప్పో సొప్పో చేసి ఫీజు చెల్లిస్తామని విజ్ఞప్తి చేసే స్థాయికి పరిస్థితి చేరుకున్నది. దీన్ని ఆసరాగా చేసుకొని లక్షల్లో ఫీజులు వసూలు చేశారు. పట్టణంలోని కొన్ని ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ చికిత్స కోసం రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకు తీసుకున్నారు. ఐసీయూలో ఉన్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో కూడా రోగుల బంధువులకు తెలియకుండా డబ్బులు గుంజుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేమున్నామంటూ జీజీహెచ్ వైద్యు లు, సిబ్బంది 24 గంటలపాటు వైద్య సేవలు అందించి వందలాది మంది ప్రాణాలు కాపాడారు.
అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తాం..
కొవిడ్ ప్రబలగానే అనేక మంది భయాందోళనలకు గురయ్యారు. చాలా మంది స్థానికంగా వైద్యం అందదేమో అని హైదరాబాద్ వెళ్లారు. కానీ మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో ఎవరూ ఊహించని విధంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. 500 పడకల కొవిడ్ కేర్ సెంటర్ సేవలు ప్రారంభించాం. అడిగినన్ని మందులు అందుబాటులో ఉంచాం. వైద్యులు, సిబ్బందికి అన్ని సదుపాయాలు కల్పించి రోగులకు సేవలందించేలా ప్రోత్సహించాం. మహబూబ్నగర్ జీజీహెచ్ వైద్య సేవలు బాగున్నాయని తెలిసి అనేక మంది హైదరాబాద్ నుంచి కూడా వచ్చి వైద్యం పొందారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు చిన్న జిల్లా దవాఖానగా ఉన్న స్థాయి నుంచి నేడు అత్యుత్తమ వైద్య సేవలందించే స్థాయికి తీసుకొచ్చాం. సీఎం కేసీఆర్ సహకారంతో జీజీహెచ్ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. కొవిడ్పై పోరుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది.
సన్నద్ధంగా ఉన్నాం..
మహబూబ్నగర్ జనరల్ దవాఖాన లో బుధవారం ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ద వాఖానలో అత్యుత్తమ వై ద్య సేవలు అందించేందు కు సిద్ధంగా ఉన్నాం. వైద్యు లు, సిబ్బంది, ఆక్సిజన్, ఐసీయూ పడకలు, మందు లు అన్నీ అందుబాటులో ఉన్నా యి. కొవిడ్ నిబంధనలు పాటిస్తే వైరస్ రాకుండా చూడొచ్చు. కొవిడ్ సో కినట్లు అనుమానంగా ఉంటే సమీప వైద్యశాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.
24 గంటల వైద్య సేవలు..
రెండేండ్లుగా కొవిడ్పై పోరులో జీజీహెచ్ మహబూబ్నగర్ సేవలు అందరి కీ తెలిసిందే. మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం తో అనేక మందికి కొవిడ్ వైద్యం అందించే అవకాశం ఏర్పడింది. హైదరాబాద్కు రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. మార్చి 2020 నుంచి ఇప్పటివరకు 3,076 కొవిడ్ రోగులకు చికిత్స అందించడం ఓ రికార్డు. దవాఖానలో చేరిన వారికి అత్యుత్తమ వైద్యం, ఉచితంగా మందులు, భోజన సదుపాయం ప్రభుత్వం కల్పించింది.