ముషీరాబాద్ : ప్రముఖ ఛాయా చిత్రకారుడు గుడిమల్ల భరత్ భూషణ్ (68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున నల్లకుంట పద్మకాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ వ్యవహార శైలి, సంస్కృతిని తన ఛాయా చిత్రాల ద్వారా ప్రపంచానికి చాటిన గుడిమల్ల భరత్భూషణ్ 1954లో వరంగల్లోని ఓల్డ్ బీట్ బజార్లో జన్మించారు. ఆయనకు భార్య సుభద్ర, కూతురు అనుప్రియ, కుమారుడు అభినవ్ ఉన్నారు. గుడిమల్ల మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు కడసారి చూపు కోసం ఆయన నివాసానికి తరలివచ్చారు.
ఎమ్మెల్సీలు ఎల్.రమణ, గోరెటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, న్యూడెమోక్రసి నేత గోవర్థన్, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య తదితరులు ఆయన పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అంబర్పేట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
తెలంగాణ గొప్పదనాన్ని చాటిని చిత్రకారుడు
ఫొటోగ్రాఫర్గా జీవితాన్ని ప్రారంభించిన గుడిమల్ల భరత్ భూషణ్ అపురూప చిత్రాలను తీర్చిదిద్దే ఛాయా చిత్రకారుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఎలుగెత్తి చాటుతూ వేలాది ఛాయా చిత్రాలు రూపొందించారు.
తెలంగాణ ఉద్యమ చైతన్యం లేని రోజుల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష, బతుకమ్మ, చరిత్ర, గ్రామీణుల బతుకు చిత్రాలను తన కెమెరాలో బంధించారు. కాళోజీ, చాకలి ఐలమ్మ, తెలంగాణ పల్లెల్లోని గడపలు, బతుకమ్మ ఆట, చారిత్రక ఘట్టాలను ఛాయా చిత్రాలుగా మలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు.