నిజామాబాద్, జనవరి 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుబంధు పథకం వచ్చిన తర్వాత కర్షకుల బతుకులు గాడిలో పడుతున్నాయి. గతంలో ప్రభుత్వాలకే వివిధ రూపంలో రైతులు సొమ్ములు చెల్లించే పరిస్థితి ఉండేది. కానిప్పుడు సీఎం కేసీఆర్ చొరవతో పెట్టుబడి సాయం కింద నగదు నేరుగా రైతులకే అందిస్తున్నారు. గుంట భూమి ఉన్న రైతు నుంచి మొదలుకొని పట్టాదారు పేరు మీద భూముల వివరాల మేరకు ఆర్థిక సాయం చేరుతున్నది. సాగుకాలం మొదలవుతున్న సందర్భంలోనే ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నది. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో రూ.వేల కోట్లు వెచ్చించి రైతుబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుండడంతో సీఎం కేసీఆర్కు అన్నదాతలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆయన చిత్రపటానికి ఊరూ… వాడా తేడా లేకుండా క్షీరాభిషేకాలు చేస్తున్నారు.
10వ తేదీ వరకు సంబురాలు..
వ్యవసాయ రంగం పురోగమించడానికి కేసీఆర్ అమలు చేసిన అనేక కార్యక్రమాలు ఉపకరించాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు నీటి సౌకర్యం కల్పించడం ద్వారా బీడు భూములు సాగులోకి వచ్చాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు పడడంతో భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. కాలువల కింద సాగుకు ఊపిరి పోసినట్లు అయ్యింది. నీళ్లుండే, కరెంట్ వచ్చే… పెట్టుబడికి ప్రభుత్వమే పైసలివ్వడంతో రైతు కాసింత శ్రమ పడితే పంటలు పండించే పరిస్థితికి రాష్ట్రం చేరుకున్నది. ఇందులో భాగంగా ఎనిమిది విడుతల్లో రైతులకు అందించిన రైతుబంధు మొత్తం విలువ రూ.50వేల కోట్లకు చేరడంపై ఈనెల 10వ తేదీ వరకు సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా మాక్లూర్ ప్రభుత్వ పాఠశాలలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున రైతుబంధు సంబురాలు జరిగాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే జాజాల సురేందర్ క్షీరాభిషేకం చేశారు. బాన్సువాడలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
రూ.50వేల కోట్లకు రైతుబంధు సాయం..
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రైతుబంధు పథకం పేరి ట చేసిన సాయం అక్షరాల యాభై వేల కోట్ల రూపాయలు. ఇదీ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగేండ్ల కాలంలో పెట్టుబడి సాయంగా రైతుకు సర్కారు అందించిన మొత్తం విలువ. 2018, వానకాలం నుంచి అమలవుతూ వస్తున్న పథకం ఎన్ని సంక్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దరిమిలా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులపై ప్రేమను ఒలకబోస్తున్నట్లుగా బొటాబొటిన సాయం చేస్తూ చేతులు దు లుపుకొంటున్నది. కేవలం వేల మందికి అరకొర సా యంతో కేంద్రం గొప్పలు చెప్పుకుంటుంటే… రాష్ట్రంలో ఎనిమిది విడుతల్లో రైతులకు అందించిన ఆర్థిక సా యం రూ.50వేల కోట్లకు చేరుతుండడం చరిత్రగా నిలిచిపోనున్నది. ఈ నెల 10వ తేదీ నాటికి ఎనిమిదో విడుత రైతుబంధు సాయం అర్హులైన రైతులందరికీ జమ కానున్నది. ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ రైతులు, రైతు నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహిస్తున్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు సాయం 50వేల కోట్ల రూపాయలుగా ఉండగా..ఒక్క నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల మందికి అందించిన సాయం కూడా రికార్డు స్థాయిలో రూ.2వేల కోట్లకు చేరుతుండడం విశేషం.