కోటగిరి, ఆగస్టు 17: పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు అందిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని టాక్లీ, సోంపూర్, రాంగంగానగర్, కొల్లూర్, సుంకిని గ్రామాల్లో పర్యటించారు. ట్రాక్టర్ నడుపుతూ.. సమస్యలు తెలుసుకొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టాక్లీలో నిర్మించిన 20 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించి, మరో పది ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. సోంపూర్లో రూ.16లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, 30 డబుల్ బెడ్ రూం ఇండ్లు, అంగన్వాడీ, ఎస్సీ కమ్యూనిటీ భవనాల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కొల్లూర్, సుంకినిలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, పాఠశాల అదనపు గదుల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో స్పీకర్ మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన తెలంగాణలో రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డకు ఇబ్బందులు లేకుం డా ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు అందిస్తున్నామని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నామని, బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు వేల ఇండ్లు ఇచ్చామన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో మరో ఐదువేల ఇండ్లు మంజూరైనట్లు చెప్పారు. ఇంకా అవసరమైతే మరో ఐడు వేల ఇండ్లు మంజూరు చేయిస్తామన్నారు. రైతుల వినతి మేరకు టాక్లీ నుంచి సాలంపాడ్ వెళ్లే రైతుల పొలాల దారిని నిర్మించడానికి ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.కోటి కేటాయించినట్లు తెలిపారు. అనంతరం స్పీకర్ పోచారం స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పంట పొలాలను పరిశీలించారు. సమావేశంలో స్థానిక సర్పంచులు విమలాబాయి, భాగ్యలక్ష్మి, కాలే నాగరాణి, మాధవ్రావు, ఎంపీసీ వల్లెపల్లి సునీత, జడ్పీటీసీ శంకర్పటేల్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీటీసీలు అనంత విఠల్, ఎస్. సాయిలు, ఏఎంసీ చైర్మన్ నీరడి గంగాధర్, మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.