రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం నల్లగొండలో పర్యటించారు. ముందుగా పట్టణంలోని భక్తాంజనేయ సహిత సంతోషిమాత ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్జాలబావి, అనిశెట్టిదుప్పలపల్లిల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత ధాన్యం తెచ్చారు? అంటూ నేనెవరో తెలుసా అని రైతులతో సంభాషణ సాగించారు. రైతుల సమాధానాలతో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయంటూ సంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లాలో గతేడాది కంటే అదనంగానే ఈ సారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, వర్షాలే రైతులను ఇబ్బందులకు గురి చేశాయని వ్యాఖ్యానించారు. ఇక్కడికి రావడం, రైతులతో మాట్లాడడం సంతోషాన్నిచ్చిందని మీడియాతో ఆమె వెల్లడించారు.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ)/తిప్పర్తి : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం నల్లగొండ పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం 11.33గంటలకు నల్లగొండకు చేరుకున్న గవర్నర్కు ఆర్అండ్బీ అతిథి గృహంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ రంగనాథ్ జిల్లా యంత్రాంగం తరఫున స్వాగతం పలికారు. అక్కడి నుంచి పాతబస్తీలోని షేర్బంగ్లాలో పునఃప్రతిష్ఠించిన శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత ఆలయానికి చేరుకున్నారు. పూజల అనంతరం ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకుని ధాన్యం రాశుల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు.
వినతుల వెల్లువ…
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టతనివ్వాలని అదేవిధంగా సీఎంఆర్ సేకరణలో ఎఫ్సీఐ తీరుపై గవర్నర్కు వివిధ సంఘాల ఆధ్వర్యంలో వినతులు వెల్లువెత్తాయి. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో స్పష్టమైన వైఖరి చెప్పించాలంటూ గవర్నర్కు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి రైతులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. సీఎం కేసీఆర్ అనేక పథకాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతుంటే కేంద్ర ప్రభుత్వ తీరు ఆటంకంగా మారిందని వివరించారు.
యాసంగిలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి : సీపీఎం
యాసంగిలో ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఈ వానకాలంలో బియ్యం సేకరణను ఫిబ్రవరి వరకు పొడిగించాలని కోరుతూ సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. యాసంగిలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయబోమనడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని వివరించారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండా శ్రీశైలం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీరెపల్లి వెంకటేశ్వర్లు, కూన్రెడ్డి నాగిరెడ్డి ఉన్నారు.
ఎప్పటిలాగే బాయిల్డ్ రైస్ తీసుకోవాలి : సీపీఐ
యాసంగిలోనూ దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్గా తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని సీపీఐ అధ్వర్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి నేతృత్వంలో జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, ఏఐటీయూసీ నేత పల్లా దేవేందర్రెడ్డి గవర్నర్ను కలిశారు.
టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో..
యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసి హమాలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. వ్యాగన్లు కేటాయించక పోవడంతో ఎగుమతులు, దిగుమతులు లేవని తెలిపారు. అవుట రవీందర్, ఆర్.ఆచారి, సిలువేరు ప్రభాకర్, మల్లయ్య పాల్గొన్నారు.
అడ్వకేట్స్ రైతుల ఆధ్వర్యంలో..
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని, అదేవిధంగా ఎఫ్సీఐ ప్రస్తుత బియ్యం సేకరణను వేగంగా పూర్తి చేసేలా చూడాలని కోరుతూ నల్లగొండ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గుండె వెంకటేశ్వర్లు, గోలి అమరేందర్రెడ్డి గవర్నర్కు వినతిపత్రం అందజేశారు.
నేనెవరో తెలుసా..
మిమ్మల్ని కలువడం సంతోషంగా ఉంది గవర్నర్ పానగల్కు చెందిన మహిళా రైతు మల్లమ్మను పలుకరిస్తూ ‘అసలు నేనెవరో తెలుసా..’ అంటూ ప్రశ్నించారు. దీంతో మల్లమ్మ పేరు తెల్వదు గానీ మీరు గవర్నర్ అని తెలుసని బదులిచ్చింది. దీనికి గవర్నర్ స్పందిస్తూ నా పేరు డాక్టర్ తమిళిసై, రాష్ట్ర గవర్నర్ను అని పరిచయం చేసుకున్నారు. ఎన్ని వడ్లు తెచ్చావు? ఇబ్బందులు ఉన్నాయా? అని ప్రశ్నిస్తే 93 బస్తాలు తెచ్చాను. వర్షాలతో తూకం సరిగ్గా రాలేదని మల్లమ్మ వివరించింది. అంతకుముందు చర్లపల్లికి చెందిన మధుసూదన్రెడ్డి అనే రైతును పలుకరిస్తే వడ్లు బాగానే కొంటున్నారని సమాధానమిచ్చారు. యాసంగిలో వడ్లు వేయాలో వద్దో అర్థం కావడం లేదని రైతు చెబుతుండగా గవర్నర్ అక్కడి నుంచి కదిలారు.
తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి ఐకేపీ కేంద్రంలో గవర్నర్ రైతులతో మాట్లాడారు.
గవర్నర్ : నీపేరేమిటి?
రైతు : సోమనబోయిన తిరుపతయ్య
గవర్నర్ : ధాన్యం తెచ్చి ఎన్నిరోజులు
అవుతుంది.?
రైతు : 15 రోజులు అవుతుంది.
గవర్నర్ : ఎమైనా సమస్యలు ఉన్నాయా..?
రైతు : ఏసమస్యలూ లేవు మేడమ్
(మరో రైతును పలుకరిస్తూ..)
గవర్నర్ : నీ పేరేమిటి?
రైతు : నా పేరు కునుకుంట్ల మారయ్య
గవర్నర్ : ధాన్యం మేలు రకమైనవేనా
రైతు : అవును మేడమ్.. నాణ్యమైనవే
ఈ విధంగా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంతమంది రైతుల ధాన్యం వచ్చిందని అడిగారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ఈ సారి నల్లగొండ జిల్లాలో అదనంగానే కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. అతివృష్టి కారణంగానే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. రైతులను కలుసుకోవడం… కొనుగోలు కేంద్రాలను సందర్శించడం సంతోషంగా ఉన్నదని గవర్నర్ వ్యాఖ్యానించారు.