నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్దే విజయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో
టీఆర్ఎస్కు ఉన్న బలం రీత్యా ప్రధాన పార్టీలు అసలు పోటీకే వెనుకంజ వేశాయని గుర్తుచేశారు. నల్లగొండ జిల్లాకేంద్రంలో శనివారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి, అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితోపాటు రెండు నియోజకవర్గాల ముఖ్య నేతలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రి జగదీశ్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రాధాన్యత ప్రకారం జరిగే ఓటింగ్ విధానంపై నమూనా బ్యాలెట్ చూపుతూ ఓటు ఎలా వేయాలన్న దానిపై వివరించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కోటిరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమయంలో పార్టీ ఆదేశాల ప్రకారం క్రమశిక్షణతో పార్టీ అభ్యర్థి నోముల భగత్ గెలుపు కోసం కోటిరెడ్డి కృషి చేశారన్నారు. ఆ సమయంలో తనకు ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోయినా శక్తివంచన లేకుండా పనిచేశారని పేర్కొన్నారు. కోటిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని ఆ సమయంలోనే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, దానిని నిలబెట్టుకుంటూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుఫున నిలబెట్టారని గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాలో పార్టీకి ఉన్న బలాబలాల రీత్యా కోటిరెడ్డి విజయం ఎప్పుడో ఖాయమైనా… భారీ మెజార్టీ సాధించాలన్నారు. పార్టీ ఓటర్లతో పాటు ఇతర ఓటర్లను కూడా ఆకర్షించి అత్యధిక ఓట్లతో రికార్డు విజయం సాధించాలని పిలుపునిచ్చారు. అందరూ ఓటింగ్ ప్రక్రియపై అవగాహనతో ఓట్లు వేయాలన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేస్తూ పార్టీ అభ్యర్థికి ఎదురుగా ఒకటి అనే అంకెను వేయాల్సి ఉంటుందని సూచించారు. ఈ ఎన్నికల్లో విజయం ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలో టీఆర్ఎస్ విజయపరంపరను మరోసారి చాటాలని పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల బలోపేతం సీఎం కేసీఆర్తోనే సాధ్యం : గుత్తా
ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల బలోపేతం సీఎం కేసీఆర్తోనే సాధ్యమన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తుంటే కేసీఆర్ వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్జీఎఫ్ నిధులను రద్దు చేసి స్థానిక సంస్థలకు కేంద్ర తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. ఆర్థిక సంఘం నుంచి జిల్లా, మండల పరిషత్లకు అందాల్సిన 20, 30శాతం నిధులను కూడా రద్దు చేసి వాటిని కేంద్రం గ్రామపంచాయతీలకే కేటాయించిందని గుర్తు చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ కేంద్రంతో కొట్లాడి 10 శాతం నిధులు వచ్చేలా కృషి చేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, కోటిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం వల్ల అభివృద్ధికి మరింత ఊతమివ్వాలని కోరారు. అందరం సమిష్టిగా కృషి చేసి భారీ మెజార్టీతో కోటిరెడ్డిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నడుచుకుంటూ జిల్లా అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు తన గెలుపులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే అందుబాటులో ఉంటూ స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
అందరినీ ఆకట్టుకునే భాష రోశయ్య సొంతం
సూర్యాపేట టౌన్, డిసెంబర్ 4 : రాజకీయా ల్లో ప్రత్యర్థులను సైతం తన భాషతో ఆకట్టుకునే మనస్తత్వం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సొంతమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రోశయ్య మృతి పట్ల జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుకున్నారు. ఆర్థిక క్రమశిక్షణ ఆచరించడమే గాకుండా ఇతరులకు ఆదర్శంగా, మార్గ దర్శకుడిగా ఉండేవారని గుర్తుచేశారు. రాజకీయ విలువలకు ఆయన పెట్టింది పేరు, రోశయ్య మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీరని లోటు అని పేర్కొన్నారు.