సూర్యాపేట, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అన్ని వర్గాలతోపాటు హోంగార్డులకూ మంచిరోజులు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో కనీస వేతనానికి నోచుకోని వారికి సగౌరవం లభించింది. పోలీసు సిబ్బందికి తీసిపోని విధంగా అన్ని విధులు నిర్వహిస్తున్నప్పటికీ గత ప్రభుత్వాలు శ్రమ దోపిడీ చేశాయి తప్ప పట్టించుకోలేదు. 2014 ముందు వరకు వారి జీతం ఇంటి ఖర్చులకు కూడా సరిపోయే విధంగా లేకపోగా రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో వేతనాలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇవ్వగా తాజాగా హోంగార్డులకు కూడా 30 శాతం పెంచింది.
రూ.12 వేల నుంచి 30 వేలకు..
తెలంగాణ ఏర్పాటు నాటికి హోంగార్డుల వేతనం రూ.12వేలు ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి వేతనాల పెంపుతోపాటు అలవెన్సులు కల్పించారు. తాజాగా 30 శాతం పెంపుతో వారి వేతనం రూ.30 వేలకు చేరుకోనుంది. 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ హోంగార్డులను ప్రగతి భవన్కు పిలిచి వరాలు గుప్పించారు. అప్పుడు రూ.12 వేల నుంచి రూ.20 వేలకు చేయడంతోపాటు ప్రతియేటా రూ.వెయ్యి ఇంక్రి మెంట్ ప్రకటించారు. ఇలా నాలుగేండ్లలో ఇంక్రిమెంట్లు రూ.4వేలు పెరుగడంతో ప్రస్తుతం రూ.24వేలకు చేరుకుంది. తాజా ఉత్తర్వులతో మరో 6వేల వేతనం పెరుగనుంది.
ట్రాఫిక్ విధులు నిర్వహించే వారికి రూ.39 వేలు
ట్రాఫిక్ విధులు నిర్వర్తించే హోంగార్డుల వేతనాలు రూ.39 వేలకు పెరుగనున్నాయి. కానిస్టేబుళ్లకు ఇచ్చినట్లుగా ట్రాఫిక్ విధులు నిర్వహించే హోంగార్డులకు రూ.6వేల అలవెన్సు ఇస్తుండగా ఇతర హోంగార్డుల కంటే ట్రాఫిక్ విధులు నిర్వహించే హోంగార్డులకు ప్రస్తుతం రూ.36వేలు వేతనం అందుతున్నది. వీరికి మరో రూ.3వేలు పెరుగనుండగా రూ.39 వేలకు చేరే అవకాశం ఉంది. వేతనాల పెంపుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 1140 మంది హోంగార్డులకు లబ్ధి చేకూరనుంది. గౌరవంగా జీవించేలా ఆర్థిక భరోసా కల్పిస్తుండడంపై హోంగార్డుల కుటుంబాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.
స్వరాష్ట్రంలోనే హోంగార్డులకు గుర్తింపు
ఇతర ఉద్యోగుల మాదిరి హోంగార్డులకు సైతం ఆర్థిక భరోసా కల్పిస్తూ వేతనాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గత ప్రభుత్వాలు మా ఇబ్బందులను పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో హోంగార్డులకు గుర్తింపు లభించింది. సీఎం కేసీఆర్ చలువతో హోంగార్డుల జీవితాలు బాగుపడుతున్నాయి.
-యాదగిరి, హోంగార్డుల వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు