బండ్లగూడ : ఔటర్ రింగ్రోడ్డు లోపల ఉన్న గ్రామాలలో మంచి నీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.
బండ్లగూడ జాగీర్ పరిధిలోని కిస్మత్పూర్ గ్రామంలో నీటి ఎద్దడి నివారణ కోసం ఆయన మేయర్ మహేందర్గౌడ్, కార్పొరేటర్ నిఖిలా సంగారెడ్డితో కలిసి పది లక్షల నీటి సామర్ధ్యం గల మంచినీటి ట్యాంకు నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో మంచి నీటి ఎద్దడి లేకుండా చేస్తామని తెలిపారు.
నూతనంగా నిర్మాణం చేపడుతున్న ట్యాంకు ద్వారా గ్రామ పరిసరాల్లో ఉన్న కాలనీలకు సైతం మంచినీటిని అందిస్తామని తెలిపారు. తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా మంచి నీటి సమస్యను తీర్చేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.