సైదాబాద్ : మహిమగల కరణ్బాగ్ మల్లన్న స్వామి కల్యాణమహోత్సవం కన్నుల పండువగా అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం సైదాబాద్ కరణ్బాగ్కాలనీలో మల్లిఖార్జున స్వామి ఆలయంలో మల్లన్నస్వామి కల్యాణోత్సవం అత్యంత భక్తిశ్రద్దలతో ఆలయ ఆర్చకులు నిర్వహించారు.
మల్లన్నస్వామి కల్యాణోత్సవాన్ని తిలకించటానికి వివిధ ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయంలో ఉదయం స్వామివారి మేలుకొలుపు, కొట్నం, శ్రీ బలిజ మేడల దేవి, గొల్ల కేతమ్మ సమేత శ్రీ మల్లన్నస్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండువగా కొనసాగింది.
మల్లన్నస్వామి వారి కల్యాణానంతరం భక్తులు అగ్నిగుండాలు, గొలుసు తెంపడం కార్యక్రమాలు ఒగ్గు పూజారి మారయ్య బృందం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. అదే విధంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అగ్ని గుండాల్లో పలువురు భక్తులు నిప్పుల్లో నడిచి స్వామివారిపై ఉన్న తమ భక్తిని చాటుకున్నారు.
అనంతరం గొలుసు తెంపటం, ఒగ్గు పూజారులకు, శివశక్తులకు సన్మానం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించటానికి వచ్చిన భక్తులు స్వామివారికి కట్న కానుకలను చెల్లించి తమ మొక్కులను తీర్చుకున్నారు.
కల్యాణోత్సవానికి తరలివచ్చిన భక్తులందరికీ కొవిడ్ నిబంధనలు పాటించాలని, అందరూ మాస్క్లను, శాటిటైజర్లు అందజేసి, భౌతిక దూరం పాటించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సైదాబాద్ పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
కల్యాణోత్సవానికి హాజరైన ఎమ్మెల్సీలు.
మల్లన్నస్వామి స్వామి కల్యాణోత్సవానికి ఎమ్మెల్సీలు యెగ్గే మల్లేశం, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ముదికొండ శ్రీనివాస్ రావు, ఈవో జయంతి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గడ్డం నందు, పొట్లపల్లి విషువర్ధన్రావు, కొశిక క్రిష్ణ, ఏనుగు పంకజారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సైదాబాద్ డివిజన్ అధ్యక్షులు పగిళ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మన్సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.