భూ వివాదం వృద్ధ దంపతుల ప్రాణాలు బలిగొన్నది. కొడుకు హైదరాబాద్లోని సొదరి ఇంటికి వెళ్లగా ఇదే అదనుగా దుండగులు వృద్ధులను అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఇంటిలోకి ప్రవేశించి పదునైన ఆయుధాలతో తల, నుదుటిపై బాది చంపారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం చల్లపల్లిలో సంచలనం సృష్టించింది.
మంథని రూరల్, మే 11: భూవివాదం ఇద్దరి వృద్ధ దంపతుల ప్రాణాలు తీసింది. దుండగులు అత్యంత కిరాతకంగా తల, నుదుటిపై బాది హతమార్చాడు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం చల్లపల్లిలో సంచలనం సృష్టించింది. మంథని ఎస్ఐ చంద్రకుమార్ కథనం ప్రకారం.. మండలంలోని పుట్టపాక పంచాయతీ పరిధిలోని చల్లపల్లి గ్రామానికి చెందిన కొత్త సాంబయ్య(60), కొత్త లక్ష్మి(55) కొడుకు రవితో కలిసి ఉంటున్నారు.
కొడుకు ఈ నెల 6న హైదరాబాద్లోని సోదరి ఇంటికి వెళ్లాడు. ఇదే అదునుగా దుండగులు తన తల్లిదండ్రులను హత్య చేశారని కొడుకు ఆరోపించాడు. సమీప బంధువులైన కొత్త యాదగిరి, ఇసంపల్లి వనజ, ఇసంపల్లి వెంకయ్య, వినయ్, అనుముల సత్యనారాయణ అలియాస్ మధుతో సంవత్సరం నుంచి భూమి విషయంలో వివాదాలు ఉన్నాయని, వారే ఈ దారుణానికి ఒడిగట్టారని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డీసీపీ రవీందర్, ఏసీపీ గిరిప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం అక్కడికి వెళ్లి ఆధారాలు సేకరించింది.