విద్యానగర్, మార్చి 17 : పాల దిగుబడిలో గోపాలమిత్రల సేవలు కీలకమని కరీంనగర్ డెయిరీ చైర్మన్, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్లో కేంద్ర ప్రభుత్వ గోకుల్ మిషన్ సౌజన్యంతో పశు వైద్య, పశు సంవర్ధకశాఖ, పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా యువతకు కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రంలో శిక్షణ ప్రారంభించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ నరేందర్, జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఈవో డాక్టర్ వేణుగోపాల్రావు, శిక్షణ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ లింగారెడ్డితో కలిసి రాజేశ్వర్రావు ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిత్తశుద్ధి, అంకిత భావంతో గోపాల మిత్రలు పని చేయాలన్నారు. లాభాపేక్షకు ప్రాధాన్యమివ్వకుండా నిజాయితీగా సేవలందించాలన్నారు. గోపాలమిత్రల ఉన్నతికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. శిక్షణ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ లింగారెడ్డి మా ట్లాడుతూ, ప్రజా అవసరాలు, ఉత్పత్తి అవుతున్న పాల దిగుబడికి మధ్య ఉన్న అంతరాన్ని పూరించే క్రమంలో గోకుల్ మిషన్తో కేంద్ర ప్రభుత్వం గో పాలమిత్ర శిక్షణను ప్రారంభించిందన్నారు. మూ డు నెలల శిక్షణలో ఒక నెల తరగతి గదిలో సాంకేతిక అంశాల బోధన, రెండు నెలలు పశు వైద్య కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణలో తర్వాత ఉత్తీర్ణులైన వారికి ప్రమాణ పత్రం, ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందజేయడంతో పాటు కృత్రిమ గర్భధారణకు అవసరమైన పరికరాల కిట్టును అందజేస్తామన్నారు. గత నెలలో మొదటి బ్యాచ్కు తరగతి గది శిక్షణ పూర్తి కాగా, ప్రస్తుతం మెదక్ జిల్లాకు చెందిన 32 మందితో రెండో బ్యాచ్ ప్రారంభమైందని వివరించారు. ఈవో వేణుగోపాల్రావు మాట్లాడుతూ, గత శిక్షణకు, ప్రస్తుత శిక్షణకు తేడాలను వివరించారు. డాక్టర్ నరేందర్ మాట్లాడుతూ, పశు కృత్రిమ గర్భధారణ పైనే దృష్టి సారించాలన్నారు. దాని తర్వాతే ప్రాథమిక వైద్యం గురించి ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ దివ్య, డాక్టర్ కోటేశ్వర్రావు, సిబ్బంది హరిప్రియ, విద్యార్థులు పాల్గొన్నారు.