సికింద్రాబాద్ : ఏ పార్టీకీ సాధ్యం కాని రీతిలో టీఆర్ఎస్ లో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా కొనసాగించేందుకు కసరత్తు ప్రారంభమైంది. కమిటీల ఏర్పాటులో స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరి అభిప్రాయాలతో సమష్టి నిర్ణయాలకే పెద్దపీట వేసేందుకు సమాయత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్తో పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జీ , పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ సమీక్ష నిర్వహించారు.
పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు కమిటీల నిర్మాణాల్లో అన్నివర్గాలకూ ప్రాధాన్యతనిస్తూ సామాజిక న్యాయాన్ని పాటించేలా తీసుకోవాల్సిన చర్యలపై సుధీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గంలోని 222 బూత్లతో పాటు 120 బస్తీల్లో కమిటీల నియామకం పారదర్శకంగా కొనసాగేలా, పార్టీపరంగా చురుకైన వారిని ప్రత్యేకంగా గుర్తించి బాధ్యతలు అప్పజెప్పాలని నిర్ణయించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మెజార్టీ డివిజన్లలో యువతకే అవకాశం ఇచ్చేలా అడుగులు వేస్తున్నారు.
2014 నుంచే నియోజకవర్గంలో పద్మారావుగౌడ్ నేతృత్వంలో బస్తీ కమిటీలు ఏర్పాటు కావడంపై బండి రమేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 20 లోపు కమిటీల ఏర్పాటు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ కమిటీల్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించేలా 51 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ కమిటీల ఎన్నిక పూర్తి చేసే విధంగా దిశానిర్ధేశం చేయాలని సూచించారు.
పార్టీ పటిష్టతకు బలమైన కమిటీలే పునాది
రానున్న కాలంలో ప్రభుత్వానికి సమాంతరంగా పార్టీని తీర్చిదిద్దాలనేదే అధినేత కేసీఆర్ లక్ష్యం. అందుకే సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో బలమైన కమిటీల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాం. స్థానిక పరిస్థితులపై అవగాహనతో ప్రజల్లో ఉంటూ, చురుకుగా వ్యవహరిస్తూ, సమన్వయంతో ముందుకు సాగే సామర్థ్యం ఉన్న వారికే కమిటీల్లో ప్రాధాన్యమిస్తున్నాం. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వారధిగా కమిటీలు పని చేయాలన్నదే లక్ష్యం. ఆ దిశగా సికింద్రాబాద్లో సంస్థాగత నిర్మాణం కొనసాగుతున్నది.