పుస్తకం అంటే పురోగమనం. దిక్సూచిగా మారి చైతన్య కరదీపిక అయ్యి మానవ మానసిక వికాసానికి
దోహదం చేస్తున్నది. ఆదిమం నుంచి నేటి రోబోటిక్ యుగం వరకూ ఎన్ని తరాలు మారినా పుస్తకమే
మానవ నాగరికతను ముందుండి నడిపించిందనడంలో అతిశయోక్తి లేదు. అప్పుడు.. ఇప్పుడు..
ఎప్పుడైనా విజ్ఞానభాండాగారమే పుస్తకం. “చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి
పుస్తకం కొనుక్కో” అని ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు ఆనాడే
పుస్తకానికున్న ప్రాముఖ్యతను చెప్పారు. కాలం మారినా, యుగాలు గడిచినా తరగని చరిత్ర
ఏదైనా ఉందంటే పుస్తకానిదేనని చెప్పొచ్చు. పుస్తక పఠనం అంటే సంస్కృతి వికాసంతో
పాటు ఆలోచనా ప్రవాహాలను పెంపొందించే జ్ఞాన నిధి. మౌన ప్రవక్తగా ఉన్నా.. ఎప్పటికప్పుడు
మార్గదర్శిగా నిలుస్తూ మనిషిని మహావక్తగా తీర్చిదిద్దుతుంది. అదే పుస్తకానికున్న మహోన్నత శక్తి.
శనివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 34వ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై బుక్ స్టాళ్లను ప్రారంభించారు. జ్ఞాన సముపార్జన పుస్తక పఠనంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. పుస్తక ప్రియుల కోసం రవీంద్ర భారతిలో నిరంతరం అందుబాటులో ఉండేలా పుస్తక ప్రదర్శన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 28 వరకు పుస్తక ప్రదర్శన కొనసాగనున్నది.
కాళోజీ మాటలు గుర్తుకు తెచ్చుకోవాలి
పుసక్త ప్రియులకు పెద్ద పండుగలా హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ నిలుస్తుంది. ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే ఒకేఒక్క సాధనం పుస్తకం. ‘ప్రపంచం నన్ను దూరం కొడితే పుస్తకం నన్ను అమ్మలా ఆదరించి దరికి చేర్చింది’అని అంబేద్కర్,‘ఒక్క సిరాచుక్క లక్ష మెదల్లకు కదలిక’అని కాళోజీ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటే పుస్తకం విలువేంటో తెలుస్తుంది. పుస్తకాన్ని ప్రేమించేవారు సమాజంలో ఎవ్వరినీ ద్వేషించే వీలుండదు. హైదరాబాద్ పుస్తక పండుగ ప్రపంచ స్థాయికి చేరుకోవాలి.
గంగా జెమునా తెహజీబ్..
హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ గంగా జెమునా తెహజీబ్గా సంస్కృతికి ఆలవాలంగా నిలుస్తున్నది. పోతబోసిన అక్షరాలను ఆదరించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది. రాష్ట్రం ఏర్పాటు తర్వాతే కవులు, రచయితలు, కళాకారులకు గుర్తింపు వచ్చింది. సామాజిక స్పృహ కలిగిన పుస్తకాలను చదవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కోడికూయక ముందే సామాజిక మాధ్యమాల్లో పనికిమాలిన అంశాలు చక్కర్లు కొడుతున్నాయి. అవికాకుండా మార్పును తీసుకొచ్చేందుకు కొంత సమయం కేటాయిస్తే భవిష్యత్ తరం చెడుమార్గాల వైపు మళ్లకుండా ఉంటుంది. పుస్తకాలు చదివే సమాజం జ్ఞానంవైపు నడువడంలో ముందుంటుంది. మానవ నాగరికత, సంస్కృతి వర్ధిల్లాలంటే సాహిత్యం ఎంతో అవసరం.
పుస్తకం ఏ రూపంలో ఉన్నా చదివి విజ్ఞానం పెంచుకోవచ్చు. ప్రస్తుత తరం సాంకేతికతను అందిపుచ్చుకుని ఇ-బుక్స్ను చదువుతున్నారు. ఒకప్పుడు చేతిలో పుస్తకం పట్టుకుని చదివితేనే చదవడం అనేవారు. ఒకప్పుడు రచయితలు ప్రింట్ వేస్తేనే పుస్తకం అనేవారు సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరువాత జాతీయ, అంతర్జాతీయంగా డిజిటల్ లైబ్రరీలు కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో కాలాన్ని అనుసరించి పుస్తకం ఏ రూపంలో ఉన్నా చదవడమే మన కర్తవ్యంగా భావించాలి.
డాక్టర్ జె. చెన్నయ్య, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శ
కొత్త తరాన్ని ఆలోచింపజేస్తుంది..
పుస్తకాన్ని చదవడం ద్వారా మనిషితో మాట్లాడినంత అనుభవం వస్తుంది. పుస్తకాన్ని కొన్ని గంటల తరబడి చదవడానికి అవకాశం ఉంటుంది. చదివినకొద్దీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. డిజిటలైజేషన్లో అలా ఉండదు. చదవడంలో కొంత అలసట ఏర్పడుతుంది. ఎక్కువ సేపు చదవలేం. ఈ-పుస్తకాల కంటే ప్రింట్ బుక్సే ఎక్కువ సంతృప్తినిచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలోని అనేక మంది మనస్తత్వాలు, స్వభావాలు, అన్ని కాలాల చరిత్రను తెలుసుకొనే అవకాశం ఉంటుంది.
ప్రపంచ గమనాన్ని మార్చేది పుస్తకమే..
ప్రపంచ గమనాన్ని మార్చిన చరిత్ర పుస్తకానిది. పుస్తకాన్ని మించిన గొప్ప జ్ఞాన సంపద మరొకటి లేదు. పుస్తక ప్రదర్శనలను ప్రతి మండలంలో నిర్వహించాలి. అప్పుడే సమున్నతమైన జ్ఞాన సమాజాన్ని నిర్మించగలుగుతాం. ఇక ఆన్లైన్ పుస్తక పఠనం అంటే తెరమీద ఎన్నో బొమ్మలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పుస్తకాన్ని చదివితేనే కంటి ఆరోగ్యానికి మంచిది. జ్ఞానసముపార్జనకూ ఇంపుగా ఉంటుంది. డిజిటల్ పుస్తకాల కంటే అచ్చువేసిన పుస్తకాలే సాహిత్యంలో అమృతం లాంటివని నా అభిప్రాయం.
ఈ-బుక్తో పర్యావరణహితం
ప్రపంచవ్యాప్తంగా ఈ బుక్స్ వాడుకలోకి వచ్చాయి. ఇదొక అనివార్య పరిణామం. భారతదేశం చాలా గొప్పది. విమానం వచ్చిందని ఎడ్లబండిని వదులుకోలేదు. అందుకే ఇటు ఎలక్ట్రానిక్ పుస్తకాలు ఉంటాయి. అటు పుస్తకం కొనసాగుతుంది. పేపర్ బుక్కు చెట్లను కొట్టాల్సిన పరిస్థితి ఉంది. అదే ఈ-బుక్కు అవసరం లేదు. ఇందులో పర్యావరణ హితం కూడా ఉంది. బుక్స్ ఫెయిర్ లాంటివి వందల ఏండ్ల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తాయి. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే ఉత్తమం.