మైలాదేవ్పల్లి : మద్యం మత్తులో కట్టుకున్న భార్యను పారతో మోది హతమార్చిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కె నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం ..మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలో జంగయ్యయాదవ్ (60) భార్య మీనా దంపతులు నివసిస్తున్నారు.
జంగయ్య మొదటిభార్యకు పిల్లలు కలగకపోవడంతో ఆమె చెల్లెను రెండో పెండ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ఇద్దరికీ పిల్లలు కలిగారు. వీరికి మొత్తం అయిదుగురు సంతానం. మొదటి భార్య మూడు సంవత్సరాల క్రితం గుండెపోటుతో మరణించింది. ప్రస్తుతం రెండవ భార్య మీనాతో ఉంటున్నాడు.
జంగయ్య ఇంట్లో ప్రతిరోజు మద్యం తాగివచ్చి గొడవ పడేవాడు. బుధవారం రాత్రి మద్యం సేవించిన భర్తతో భార్య గొడవ పడింది. జంగయ్య ఆవేశంతో పక్కనే ఉన్న పారతో భార్య మీనా తలపై కొట్టడంతో బలమైన గాయంతో కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది.
భయపడిన నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. స్థానికులు పోలీస్టేషన్కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసునమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నామని సీఐ నర్సింహ తెలిపారు.