చార్మినార్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పాతనగరంలోని వివిధ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. చారిత్రక చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలోనూ గత మూడు రోజులగా లక్ష్మీ అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ భక్తులకు దర్శనం కల్పించారు.
చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో రాష్ట్ర గవర్నర్ తమిళి సైతోపాటు రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేంధర్, పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు సైతం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనార్ధం విచ్చేశారు.
రాష్ట్ర గవర్నర్ తమిళి సై, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేంధర్లకు ఆలయ మర్యాదలతో ట్రస్టీ శశికళ సాదర స్వాగతం పలుకుతూ ఆలయానికి ఆహ్వానించారు. భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ అనంతరం అర్చక స్వాములు అమ్మవారి ఆశీర్వచనాలను అందించారు. వారికి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు.
పోటెత్తిన భక్తులు
భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం తెల్లవారు జాము నుండే భక్తులు పోటెత్తారు. పాతనగరంతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనార్థం వేలాది మంది భక్తులు చార్మినార్కు విచ్చేశారు.
దీంతో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుండి గుల్జర్హౌస్ వరకు మూడు వరుసల్లో భక్తులు భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం కోసం నిరీక్షించారు. భక్తులు పోటెత్తడంతో ఎలాంటి తోపులాటలు జరగకుండా పోలీసులు భారీకేడ్లను ఏర్పాటు చేసి భక్తుల క్యూలైన్లను క్రమబద్దీకరించారు.