సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బోయిన్పల్లి సర్కిల్ ప్రాంతంలో తడి, పొడి చెత్త సేకరించే వాహనాలను గురువారం ప్రారంభించారు. ఫైలెట్ ప్రాజెక్ట్ కింద మొదటి విడతగా బోయిన్పల్లి సర్కిల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన వాహనాలను బోర్డు సీఈఓ అజిత్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్రెడ్డి, జంపన ప్రతాప్, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణలు ప్రారంభించారు.
చెత్త సేకరణకు వినియోగిస్తున్న అద్దె వాహనాల స్థానంలో కంటోన్మెంట్ బోర్డు సొంతంగా వాహనాలను సమకూర్చింది. ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు వ్యాప్తంగా ఇంటింటి నుంచి తడి,పొడి చెత్త సేకరణ ఆరకొరగా జరుగుతున్న నేపథ్యంలో దీన్ని 100 శాతానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుని ముందడుగు వేస్తున్నారు.
దీంట్లో భాగంగానే క్షేత్రస్థాయిలో సులువైన విధానాన్ని తీసుకొచ్చేందుకు బోర్డు అధికారులు తొలి అడుగు వేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సీఈఓ అజిత్రెడ్డి మాట్లాడుతూ తొలి విడతలో భాగంగా ఫైలెట్ ప్రాజెక్ట్ కింద బోయిన్పల్లి సర్కిల్ను ఎంచుకోవడం జరిగిందన్నారు.
సర్కిల్లో విజయవంతం అయితే మిగతా సర్కిల్లలో సైతం చెత్త సేకరణ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తా మన్నారు. వాహనాల ప్రారంభంతో క్లీన్ కంటోన్మెంట్ దిశగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. బోయిన్పల్లి సర్కిల్లో పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుందనే నమ్మకం ఉందన్నారు.
ఈ తరుణంలో మిగతా సర్కిల్లలో సైతం తడి, పోడి చెత్త సేకరణ వాహనాలను దశల వారిగా అమలు చేసేందుకు సమాయాత్తం అవుతామని తెలిపారు. కార్యక్రమంలో బోర్డు అధికారులు దేవేందర్తో పాటు ఇతర సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.