తెలుగుయూనివర్సిటీ, నవంబర్ 17. ప్రముఖ రంగస్థల సంస్థ రసరంజని ఆధ్వర్యంలో నెలరోజుల పాటు ఔత్సాహిక నటీ నటులకు నటనలో ఉచితంగా శిక్షణా శిభిరం నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, రసరంజని అధ్యక్షులు డాక్టర్ కె.వి రమణాచారి తెలిపారు.
నఫీజ్రెసిడెన్సీలో గల తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమణాచారి మాట్లాడు తూ నిజాం కళాశాల రంగస్థల శాఖ అధ్యాపకులు, నిషింభిత నాటక సంస్థ నిర్వాహకులు రామ్మోహన్ నిర్వహణలో ఉచితంగా 30రోజుల పాటు నిజాం కళాశాల ప్రాంగణంలో 30మంది అభ్యర్థులకు నటనలో శిక్షణ కొనసాగుతుందన్నారు.
ఈ శిక్షణకు ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 30వ తేదీలోగా 9849256440నెంబర్లో సంప్రదించాలని సూచించారు. డిసెంబర్ నెలలో రవీంధ్రభారతిలో రసరంజని నిర్వహణలో నాటక ప్రదర్శన ఉంటుందని రసరంజని సంస్థ కార్యదర్శి ముట్నూరు కామేశ్వరరావు తెలిపారు.
రంగస్థల ప్రముఖుల స్మారక పురస్కారాలు…
రసరంజని వ్యవస్థాపక సభ్యులు చాట్ల శ్రీరాములు, గరిమెళ్ళ రామమూర్తి స్మారకార్థం నెలకొల్పిన రంగస్థల పురస్కారాలను రసరంజని సంస్థ అధ్యక్షులు రమణ, కార్యదర్శి ఎం. కామేశ్వరరావు ప్రకటించారు.
చాట్ల శ్రీరాములు స్మారక పురస్కారాన్ని 2021కు గాను రంగస్థల ప్రముఖులు రాయల హరిశ్చంద్రుడుకు, గరిమెళ్ళ రామమూర్తి స్మారక పురస్కారం2019కు గాను సినీ నాటక రచయిత శ్రీశైలమూర్తికి, 2020కి గాను దర్శకులు ఎమ్.ఎస్.కె ప్రభుకు ప్రకటించారు.
నగదు, జ్ఞాపిక, శాలువాతో తెలంగాణ సారస్వత పరిషత్తులో డిసెంబర్ 5న జరిగే కార్యక్రమంలో సత్కరిస్తామని వారు వెల్లడించారు.