నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం వానకాలం ధాన్యాన్ని కొనుగోళ్లు చేస్తూనే మరోవైపు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను చైతన్యం చేస్తున్నది. వానకాలం దిగుబడుల్లో జిల్లా రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు బయటి ప్రాంతాల నుంచి వస్తున్న ధాన్యాన్ని అధికారులు అడ్డుకుంటున్నారు. జిల్లా సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టారు. రెండు రోజుల్లో పదికి పైగా లారీలను వెనక్కి తిప్పిపంపించారు. మరో వైపు యాసంగి సీజన్లో భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) బాయిల్డ్ బియ్యాన్ని తీసుకోబోమని చెబుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నది. వచ్చే సీజన్లో కొనుగోలు కేంద్రాలు ఉండవని, రైతులు ఇబ్బందులు పడకుండా వరి సాగు చేయొద్దని నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లా రైతాంగానికి సూచించారు.
ఉమ్మడి జిల్లాలో వానకాలం ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దొడ్డురకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు రూ.1980 మద్దతు ధరకు కొంటున్నది. సన్నాలు సాగు చేసిన రైతులంతా కోతల ప్రారంభంలో మిల్లులకు ఒకేసారి ధాన్యం తేవడంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఆదేశాలతో మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక్షణలో రైతులు నష్టపోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. రైతుల ఆతృతను ఆసరాగా చేసుకుని మిల్లర్లు, వ్యాపారులు ధర తగ్గించకుండా క్వింటాకు రూ.1850కి పైగా ధర లభించేలా చూశారు. ప్రస్తుతం సన్నాలకు మంచి ధర లభిస్తున్నది. జిల్లాలో పండే నాణ్యమైన చింట్ల రకం ధాన్యం క్వింటా రూ.2,100 -2200 వరకు పలుకుతున్నది. ధాన్యానికి మంచి ధర లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడతుండడంతో ఇదే అదునుగా కొంతమంది మిల్లర్లు, వ్యాపారులు ఆంధ్రా నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. క్వింటాకు రూ.1300 నుంచి 1,400లకు కొనుగోలు చేసి తెలంగాణలోకి లారీల్లో తరలిస్తున్నారు. ఇది రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించనుంది. నల్లగొండ, సూర్యాపేట రైతులు తీవ్ర నష్టపోయే ప్రమాదముంది. ఆంధ్రాలో తక్కువ ధరకే ధాన్యం దొరకుతుండడంతో ఇక్కడ ఎక్కువ ధర పెట్టేందుకు మిల్లర్లు, వ్యాపారులు కొర్రీలు పెట్టే అవకాశం ఉంది. గత రెండు సీజన్లలోనూ బయటి ధాన్యంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి ధాన్యం రాకను అడ్డుకున్నారు. ప్రస్తుత సీజన్లోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. దాంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని అన్ని రహదారులపై ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు.
ప్రత్యేక బృందాల తనిఖీ..
ఈ చెక్పోస్టుల్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో ప్రత్యేక బృందాన్ని నియమించారు. వీరు మూడు షిఫ్టుల్లో 24 గంటలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో చెక్పోస్టు వద్ద ఒక సీఐ, ఎస్ఐ, ఏఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లతోపాటు వ్యవసాయశాఖ నుంచి ఏఈఓ, రెవెన్యూశాఖ నుంచి వీఆర్వో విధుల్లో ఉంటున్నారు. నార్కట్పల్లి-అద్దంకి రహదారిపై దామరచర్ల మండలం వాడపల్లి వద్ద చెక్పోస్టు పెట్టారు. మూడు రోజుల కిందట దీన్ని ఏర్పాటు చేసి ఇప్పటివరకు ఇక్కడ పది లారీల ధాన్యాన్ని వెనక్కి తిప్పి పం పారు. గుంటూరు, కర్నూల్ జిల్లాల నుంచి ధాన్యం వస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసి ధాన్యం ఉన్నట్లుగా గుర్తిస్తే జిల్లాలోకి అనుమతించకుండా వెనక్కి పంపుతున్నారు. నాగార్జునసాగర్ కొత్త వంతెన వద్ద కూడా మాచర్ల వైపు నుంచి వచ్చే వాహనాలపై నిఘా పెట్టారు. చెక్పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి వద్ద కృష్ణానది బ్రిడ్జిపై కూడా చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఇక్కడ మంగళవారం తెనాలి నుంచి ధాన్యంతో వచ్చిన రెండు లారీలను, ప్రొద్దుటూర్ నుంచి వచ్చిన ఓ లారీని వెనక్కి పంపారు. కోదాడ మండలం రామాపురం అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద కూడా చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రాంతం నుంచి జిల్లాలోకి ప్రవేశించే అన్ని దారులపైనా నిఘా పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలోకి బయటి ప్రాంతాల నుంచి ధాన్యం అనుమతించబోమని పోలీసులు స్పష్ట చేస్తున్నారు.
వరి వద్దంటూ విస్తృత ప్రచారం..
యాసంగిలో వరి సాగు చేయొవద్దని జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించేలా కార్యచరణ రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎఫ్సీఐ యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకోబోమని స్పష్టం చేయడంతో ఈ సీజన్లో పండే దొడ్డు ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు అప్రమత్తమై రైతులను చైతన్యం చేయాలని నిర్ణయించింది. ఆ మేరకే జిల్లా అధికారులు యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటూ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. యాసంగిలో అసలు ధాన్యం కొనుగోలు కేంద్రాలే ఉండవని స్పష్టం చేస్తున్నారు. దొడ్డు ధాన్యం పండించే రైతులు ఇబ్బంది పడకుండా ముందస్తు అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ రైతులుతో స్వయంగా మాట్లాడారు.
యాసంగిలో పరిస్థితులు, ఎఫ్సీఐ నిబంధనలు వివరించారు. వరి సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయంగా లాభదాయక ఆరుతడి పంటలు సాగు చేయాలని కోరారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ముందే ఒప్పందం చేసుకుంటే తప్పా వరి సాగు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేసేందుకు కార్యచరణ సిద్ధ్దం చేసింది. ఇప్పటికే మండల కేంద్రాలతోపాటు ప్రధాన కూడళ్లల్లో యాసంగిలో వరి సాగు వద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. త్వరలో గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించనుంది. ఈ యాసంగిలో జిల్లా పరిస్థితులకు తగ్గట్టు వేరుశనగ, పెసర్లు, నువ్వులు, బొబ్బర్లు, మినుముల లాంటి పంటలు సాగు చేసేలా వ్యవసాయాధికారులు చూడనున్నారు. పట్టణాలకు దగ్గరల్లోని రైతులు కూరగాయలు సాగు చేసేలా ప్రోత్సహించనున్నారు. ఆయిల్పామ్ లాంటి ధీర్ఘకాలిక ప్రత్యామ్నాయ పంటల సాగు చేసే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇలాంటి పంటలనే యాసంగిలో రైతులు సాగు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ సూచించారు. యాసంగిలో వరి సాగుచేసి ఇబ్బందులు పడకుండా రైతులు లాభదాయకమైన ఇతర పంటలపై దృష్టిసారించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీనిపైనే విస్తృతంగా అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నారు.
సరిహద్దులో ధాన్యం సరఫరాపై నిఘా
దామరచర్ల : ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణాకు వస్తున్న ధాన్యంపై మండలంలోని వాడపల్లి చెక్పోస్టు వద్ద అధికారులు పటిష్ఠ నిఘాను ఏర్పాటు చేశారు. మంగళవారం ఆంధ్రాలోని గుంటూరు, నంద్యాల నుంచి వచ్చిన నాలుగు లారీలను తనిఖీ చేసి తిప్పి పంపారు. చెక్పోస్టు వద్ద ప్రతి రోజు షిప్టుల ప్రకారం పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో పది లారీల ధాన్యాన్ని తిప్పి పంపించినట్లు తెలిపారు.