బన్సీలాల్పేట్ : దీపావళి నాటికి అర్హులైన పేద లబ్ధిదారులకు ‘డబుల్ బెడ్రూమ్’ ఇండ్లను అందజేస్తామని రాష్ట్ర సినిమా టోగ్రఫి, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట్ డివిజన్లోని చాచా నెహ్రూనగర్లో ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్ల సముదాయాన్ని శుక్రవారం ఆయన హైద్రాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, సికింద్రాబాద్ ఆర్డిఓ వసంత కుమారి, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కె.హేమలత, జీహెచ్ఎంసి నార్త్జోన్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, హౌజింగ్ ఈఈ వెంకట్దాస్ రెడ్డి, భూసేకరణ అధికారి వెంకటేశ్వర్లుతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భమగా మంత్రి మాట్లాడుతూ 264 ఇండ్లకు గాను, 232 ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యిందని, మరో 16 ఇండ్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. మిగిలిన 16 ఇండ్ల నిర్మాణ పనులను కూడా త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పక్కన ఖాళీ స్థలంలో కమ్యూనిటి హాలు, అంగన్వాడి కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రతిపాదన సిద్దం చేయాలని సూచించారు. పేదలకు సకల సదుపాయాలతో రెండు పడక గదు ఇండ్ల కల నెరవేరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు.
పూర్తి ఉచితంగా కేవలం తెలంగాణాలో మాత్రమే పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని అన్నారు. ఈ పర్యటనలో సికింద్రాబాద్ తాసిల్ధార్ బాలశంకర్, జలమండలి జీఎమ్ రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టఫర్, టీఆర్ఎస్ నాయకులు పవన్కుమార్ గౌడ్, లక్ష్మిపతి, మహేశ్, వెంకటేశన్ రాజు, ప్రేమ్కుమార్, ఫహీమ్, బస్తీ అధ్యక్షుడు అచ్చా నర్సింగ్రావులు పాల్గొన్నారు.