ఖైరతాబాద్: సైనిక సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవా లని సైనిక సంక్షేమ శాఖ సిక్స్ మెన్ కమిటీ సభ్యులు కెప్టెన్ సురేశ్ రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేషనల్ ఎక్స్సర్వీస్ మెన్ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ సర్వర్ అలీ, కమిటీ సభ్యులు బోయినపల్లి ప్రభాకర్ రావు, లింగాల జగన్ రెడ్డి, మనోహర్ రెడ్డితో కలిసి మాట్లాడారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం కోసం త్యాగాలు చేస్తున్న సైనికుల సంక్షేమానికి కృషి చేయాలన్న సంకల్పంతో అనేక కార్యక్రమాలను చేపట్టారన్నారు. సైనికుల సంక్షేమం కోసం రాష్ట్ర డీజీపీ చైర్మన్గా పలువురు మాజీసైనికులతో సిక్స్మెన్ కమిటీ వేసి, తద్వారా సంక్షేమ పథకాలు నేరుగా వారికి చేరే విధంగా కృషి చేస్తున్నారన్నారు. 2017 జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రకటించిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు.
డ్యూయెల్ ఫ్యామిలీ పెన్షన్, మాజీ సైనికుడి భార్య పేరిట ఉన్నా ఇంటిపన్ను రద్దు, గ్యాలంటరీ అవార్డులు పొందిన సైనికు లకు దేశంలోనే అత్యధిక పారితోషికం, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన విద్యార్థులకు రూ.2లక్షల ఆర్థికసాయం, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు, వితంతువులకు రూ.3వేల నుంచి రూ.6వేలకు పింఛన్ పెంపు, స్పెషల్ పోలీసు అధికారులుగా పనిచేస్తున్న సైనికులకు రూ.26వేల వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు.
డబుల్ బెడ్ ఇండ్లలో రెండు శాతం అవకాశం, అనేక జిల్లాల్లో సైనిక సంక్షేమ భవనాల నిర్మాణం, మాజీ సైనికులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేసిందన్నారు. ఎంబీబీఎస్, బీటెక్, బీఆర్క్, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులో రెండు శాతం, బీఈడీలో 3 శాతం రిజర్వేషన్లు, యుద్ధంలో చనిపోయిన మాజీ సైనికుల భార్యలకు ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థిక సాయం, ఇంటి స్థలం కేటాయింపు లాంటి హామీలన్నింటిని నెరవేర్చిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనంలో కొంత భాగం సైనిక సంక్షేమానికి కేటాయించారని, సైనికుల కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్నదానికి ఇది నిదర్శనమన్నారు. కొందరు కావాలనే పనికట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, వారి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.