భద్రాద్రి కొత్తగూడెం.డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ):యాసంగి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈసారి వరి పంట వేసి రైతులు నష్టపోవద్దని సూచిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు. దానికి బదులుగా ఇతర లాభదాయకమైన పంటలు వేసుకోవాలని, వాటిల్లో యాజమాన్య పద్ధతులు పాటించి మెరుగైన దిగుబడులు పొందాలని సూచిస్తున్నారు. పంటల మార్పిడి వల్ల భూమిలో సారం పెరుగుతుందని చెబుతున్నారు. ఈసారి ఎలాంటి పంటలు వేయాలనే విషయంపై తమ శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని, ఆ మేరకు అన్నదాతలకు అవగాహన కల్పిస్తోందని వివరిస్తున్నారు. విత్తన తయారు, రైస్మ్లిలర్ల కొనుగోలు, తిండి గింజల వినియోగం వంటి అవసరాలకు మినహా పెద్ద మొత్తంలో వరి పంట వేయొద్దని సూచిస్తున్నారు. ఇవిగాక జిల్లా ప్రజలకు ఆయన మరికొన్ని సూచనలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తంగా 1,15,246 ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు యాసంగి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇతర పంటల సాగు వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో వివరిస్తున్నారు. ఇలాంటి అంశాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
నమస్తే తెలంగాణ: ఏయే పంటలను వేస్తే లాభాలుంటాయి?
డీఏవో: వరికి బదులుగా నూనె గింజలు, అపరాల పంటల సాగు వల్ల మెరుగైన దిగుబడులు వస్తాయి. గతంలో చాలామంది రైతులు సాగు చేసిన అనుభవాలనూ పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇలాంటి పంటల్లో ఎక్కువగా వేరుశెనగ, జొన్న, మినుములు, నువ్వులు, పెసర, శెనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, కుసుమ, ఆవాలు వంటి పంటలను పరిశీలించొచ్చు. వీటితోపాటు రెగ్యులర్గా వేసే పంటలను సైతం సాగు చేసుకోవచ్చు. ఈ అంశాలపై ఇప్పటికే రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాం.
నమస్తే : వరి పంటను పూర్తిగా వద్దంటున్నారా?
డీఏవో: పూర్తి స్థాయిలో వద్దని చెప్పలేం. ఎందుకంటే రైతులు విత్తనాల కోసం విక్రయాల వెసులుబాటును బట్టి పంట వేసుకుంటారు. తిండిగింజల కోసమూ వేసుకునే వెసులుబాటు ఉంటుంది. పంటను విక్రయించే ఉద్దేశం ఉంటే మాత్రం వరి సాగు వద్దు. కేంద్రం కొననంటోంది. దీంతో ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం వరి వద్దని అప్రమత్తం చేస్తోంది. ఒకవేళ వేసినా కొనుగోలు కేంద్రాలు ఉండకపోతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ యాసంగిలో వరి వద్దని, ఇతర పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది.
నమస్తే: ఇతర పంటల సాగులో సస్యరక్షణ సాధ్యమేనా?
డీఏవో: ఇతర పంటలంటే అవి కొత్తవి కావు. పూర్వకాలం నుంచి మనం సాగు చేస్తున్న పంటలే. నూనె గింజలు, అపరాలు సాగులో మెళకువలు తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు మా శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నేల స్వభావాన్ని బట్టి పంటలను వేసుకోవాలి. ముఖ్యంగా మట్టి నమూనాలను సేకరించి వాటి స్వభావం చెబుతున్నాం. దాన్నిబట్టి పంటలను ఎంపిక చేసుకోవాలి. కేవీకే శాస్త్రవేత్తలు పంటలను పరిశీలిస్తున్నారు. వాటి సస్యరక్షణ చర్యలు చెబుతున్నారు.
నమస్తే: ఇతర పంటల్లో ఉద్యానవన పంటలు కూడా ఉంటాయా?
డీఏవో: ఇతర పంటలతోపాటు ఉద్యాన పంటల సాగు కూడా రైతులకు ఎంతో మేలు. ఇప్పటికే జిల్లాలో చాలామంది రైతులు కూరగాయలు సాగు చేసి లాభాలను ఆర్జిస్తున్నారు. పందిరి సాగు లో కాకర, బోడకాకర, బీర, సొర, బెండ, వంకాయ, గుమ్మడి, కాలీఫ్లవర్, క్యాబేజీ, బొప్పాయి, జామ, మునగ, టమాటా, ఆకుకూరలు కూడా సాగుచేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే పంటలేవైనా ఉన్నాయంటే అవి ఉద్యాన పంటలే. సుజాతనగర్ మండలంలో వేపలగడ్డ, సింగభూపాలెం, అంజనాపురం, రాఘవాపురం, కాకర్ల గ్రామాల్లో ఎక్కువగా ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు.
నమస్తే : వేరుశెనగ పంట వేయాలంటే ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి?
డీఏవో: ఇసుకతో కూడిన ఎర్రచెక్క నేలల్లో వేరుశెనగ పంట బాగా సాగవుతుంది. నల్లగొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. మన జిల్లాలోనూ సాగవుతోంది. ఎకరానికి 110 కిలోల విత్తనాలను వాడాలి. ఇందులో కదిరి-6, కదిరి-1812, కదిరి-9, టీఏజీ-24 రకాలు వాడుకోవచ్చు. విత్తన శుద్ధి చేసి వాడాల్సి ఉంటుంది. నత్రజని, భాస్వరం, పొటాష్, జిప్సం వంటి ఎరువులు వాడాలి. వేరుశెనగకు వేరుపురుగు ఆశిస్తుంది కాబట్టి సీ ఆకారంలో భూమిలోపల వేర్లను కత్తిరిస్తుంది. దీని నివారణ కోసం కిలోవిత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిపాస్తో విత్తన శుద్ధి చేయాలి. దానివల్ల వేరుపురుగు రాదు. ఇదే కాదు.. ప్రతి పంటకూ యాజమాన్య పద్ధతులు ఉంటాయి.
నమస్తే: రైతులందరూ ఒకే పంటను ఎందుకు వేస్తుంటారు?
డీఏవో: కొంతమందికి అవగాహన లేక ఇతర రైతులను అనుసరిస్తుంటారు. మరికొంతమంది వినూత్న ఆలోచన చేస్తూ కొత్త పంటలపై దృష్టిపెడుతుంటారు. విద్యావంతులైన రైతులు కూడా ఎక్కువగా సాగులో ఉన్నారు. మహిళా రైతులూ వ్యవసాయం చేస్తున్నారు. అందరూ ఒకే పంటను కాకుండా వేర్వేరు పంటలు వేస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి.
నమస్తే: ఈ యాసంగిలో రైతులకు మీరిచ్చే సలహా?
డీఏవో: ఈ యాసంగిలో వరి వద్దని చెబుతున్నాం. కొనుగోలు లేదని తెలిసి కూడా ఎందుకు సాగు చేయాలి? మంచి ఆరోగ్యాన్ని అందించే సేంద్రియ పంటలను కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వాటిని సాగు చేస్తే వినియోగదారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తారు. అందుకని అలాంటి పంటల వైపు దృష్టి పెట్టాలి.