ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో పాఠశాల ఆవరణలను శుభ్రం చేయడంతో పాటు శానిటేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తార్నాక డివిజన్లోని లాలాపేట గడీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల ఆవరణను అందంగా తీర్చిదిద్దాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా స్కూల్ ఆవరణలోని మట్టి, దుమ్ము, చెత్త, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పాఠశాలను తీర్చిదిద్దాలని చెప్పారు. అన్ని పాఠశాలలను నిర్ణీత సమయానికంటే ముందే శానిటేషన్ చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.