కోటగిరి/బాన్సువాడ /నస్రుల్లాబాద్/వర్ని, జనవరి 3 : ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిపై ఎంపీ అర్వింద్ లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని.. తీరు మార్చుకోకపోతే సహించేది లేదని టీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. కోటగిరి, బాన్సువాడ, నస్రుల్లాబాద్ వర్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో ఎంపీ తీరుపై ధ్వజమెత్తారు.
కోటగిరి మండల కేంద్రంలో నాయకులు మాట్లాడుతూ అవగాహన లేని మాటలు, అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దమ్ముంటే అవినీతి నిరూపించాలని సవాల్ విసిరారు. డీసీసీబీ చైర్మన్గా పోచారం భాస్కర్రెడ్డి బాధ్యతలు తీసుకోక ముందు బ్యాంకులో రూ.192 కోట్లు బకాయిలు ఉన్నాయని, చైర్మన్ అయిన తర్వాత రూ.45 కోట్లు రికవరీ చేశారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్న పోచారం కుటుంబంపై ఆరోపణలు చేస్తే ప్రజలు కూడా సహించరన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఎంపీ మోసం చేశాడన్నారు. సమావేశంలో జడ్పీటీసీ శంకర్పటేల్, డీసీసీబీ డైరెక్టర్, పొతంగల్ విండో చైర్మన్ శాంతేశ్వర్పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, కోటగిరి విండో చైర్మన్ కూచి సిద్దూ, వైస్ చైర్మన్ గజేందర్,ఈర్వంత్ పటేల్, వల్లేపల్లి శ్రీనివాస్, సిరాజ్, తేళ్ల అర్వింద్, విజయ్పటేల్, సాయిబాబా, కిశోర్, రవి, సలీం, హరి తదితరులు పాల్గొన్నారు.
మెంబర్ ఆఫ్ పార్లమెంటా.. మెంబర్ ఆఫ్ పంచాయతా ?
ఎంపీ అర్వింద్ మెంబర్ ఆఫ్ పార్లమెంటా లేదా మెంబర్ ఆఫ్ పంచాయతా.. ఆయన మాట్లాడే మాటలు ప్రజలకు అర్థంకాని పరిస్థితి ఉందని బాన్సువాడ ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ ఎద్దేవా చేశారు. బాన్సువాడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్.. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. జిల్లా సహకార బ్యాంకు అనేది కేంద్ర నాబార్డు, ఆర్బీఐ , టెస్కాబ్ నిరంతర పర్యవేక్షణలో కొనసాగుతుందని, ప్రతి అరునెలలకు ఒక సారి జిల్లా సహకార బ్యాంకు మహాజన సభ నిర్వహిస్తారన్నారు. ప్రతి మార్చి 31 , సెప్టెంబర్ 31న సభ నిర్వహణ అనంతరం ఖర్చు, వ్యయాలను వివరిస్తారని.. ఆ విషయం బీజేపీ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. పోచారం భాస్కర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే సమయంలో రూ. కోటి లాభాల్లో ఉంటే ప్రస్తుతం రూ. 2.18 కోట్ల లా భాల బాటలో బ్యాంకు కొనసాగుతోందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో మల్యాద్రిరెడ్డి లాంటి అవగాహన లేని నాయకుల మాటలు విని ఎంపీ అర్వింద్ తన స్థాయి దిగజార్చుకుంటున్నారన్నారు. క్రమశిక్షణతో ముందుకు సాగే పోచారం కుటుంబంపై అర్థరహిత విమర్శలు చేసే ముందు ఎంపీ ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ సంగ్రాంనాయక్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఆత్మ కమిటీ అధ్యక్షుడు మోహన్నాయక్, నాయకులు దొడ్ల వెంకట్రాం రెడ్డి, మహ్మద్ ఎజాజ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నారాయణ రెడ్డి, గోపాల్ రెడ్డి, కొర్ల పోతురెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు యూనుస్, ఆయా గ్రామాల సర్పంచులు , మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
ఆరోపణలు మానుకోవాలి..
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిపై బీజేపీ ఎంపీ అర్వింద్ అసత్య ఆరోపణలు మానుకోవాలని మైలారం ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ అన్నారు. మైలారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. దమ్ముంటే అవినీతిని నిరూపించాలని సవాల్ విసిరారు. అర్వింద్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే బాన్సువాడకు వచ్చి లెక్కలు అడగాలని సవాల్ విసిరారు. సమావేశంలో విండో చైర్మన్లు దివిటి శ్రీనివాస్ యాదవ్, మారుతీ, గంగారాం తదితరులు పాల్గొన్నారు.
పబ్లిసిటీ కోసమే ఎంపీ పాకులాట
పత్రికల్లో పేరు రాయించుకునేందుకే ఎంపీ అర్వింద్ డీసీసీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై ఆరోపణలు చేశారని వర్ని మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో సోమవారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లాలి గిరి మాట్లాడుతూ కేవలం కోటి రూపాయల లాభంతో ఉన్న డీసీసీ బ్యాంకు.. భాస్కర్ రెడ్డి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తరువాత రూ. 2.18 కోట్ల లాభంలోకి తీసుకువచ్చారన్నారు. సుమారు రూ.200 కోట్లు బకాయిలను వసూలు చేస్తూ తిరిగి రుణాలు అంది స్తూ బ్యాంకును లాభాలబాట వైపు నడిపిస్తున్నారని అన్నారు. రూ. 200 కోట్లు అవినీతి చేశారని ఎంపీ అర్వింద్ అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. పసుపు బోర్డు తెస్తానని రైతులకు బాండ్ పేపరు రాసిచ్చిన ఎంపీ రైతులను మోసం చేస్తున్నాడని.. వారి దృష్టి మరల్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్య లు చేస్తే సహించేంది లేదని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో వర్ని సహకార సంఘం అధ్యక్షుడు నామాల సాయిబాబా, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దండ్ల బాలరాజు, కో ఆప్షన్ సభ్యుడు కరీం, సర్పంచ్ రాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మేక వీర్రాజు, మూడ్ అంబర్ సింగ్, మేక బుజ్జి, నాగభూషణం, రమేశ్ గౌడ్ పాల్గొన్నారు.