ముషీరాబాద్ : ప్రజల సహకారంతోనే నూరు శాతం వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ విజయవంతమవుతుందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ అన్నారు. నగరంలో ప్రతి పౌరుడు వ్యాక్సిన్ వేసుకునేలా జీహెచ్ఎంసీ యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తుందని తెలిపారు. వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం ముషీరాబాద్ డివిజన్ కళాధర్నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ నూరు శాతం వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కళాధర్నగర్ వాసులకు ప్రత్యేక ప్రొత్సాహక సర్టిఫికెట్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని 1500 కాలనీలకుగాను 950 కాలనీల్లో నూరు శాతం వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో అన్ని బస్తీల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులను ఆమె అభినందించారు. వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎక్కడా పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలను సైతం తనిఖీ చేసి పారిశుధ్యం తీరు, కోవిడ్ నిబంధనల అమలుకు తీసుకుంటున్న చర్యలను వాకబు చేయాలని అధికారులనే ఆదేశించారు. పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయడంతోపాటు వర్షపు నీరు నిలిచి ఉండకుండా చూడాలని ఆదేశించారు.
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు విధిగా వ్యాక్సిన్ వేసుకొని అధికారులకు సహకరించా లని కోరారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ కార్పొరేటర్ ఎమ్.సుప్రియా నవీన్ గౌడ్, సర్కిల్-15 డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ, ఎఎంహెచ్ఓ హేమలత, ముషీరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ పద్మజ, డాక్టర్ కృష్ణమోహన్, భాగ్యలక్ష్మీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్, బాబురావు, ఎయిర్టెల్ రాజు, జీ.రాజు, లక్ష్మణ్ గౌడ్, బీజేపీ నాయకులు ఎమ్.నవీన్గౌడ్, బద్రి, కంచి, అనిల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.