శంషాబాద్ రూరల్ : అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగి ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా మందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన శ్రీనివాసులు, యాదగిరి ఇద్దరు అన్నదమ్ములు డ్రైవర్లుగా ఒకే కొరియర్ కంపెనిలో పని చేస్తున్నారు.
ఆదివారం మరో వ్యక్తితో కలిసి హైదరాబాద్లోని కొంపల్లి ప్రాతం నుంచి కాంటైనర్లో కొరియర్ సామాగ్రిని తీసుకొని శంషా బాద్ మండలంలోని గండిగూడ వద్దకు వచ్చారు. అయితే ఇటీవల వీరి చెల్లెలు వివాహాంతో పాటు ఇంటి వద్ద ఇతర ఆస్తుల విషయమై ఇద్దరి మధ్య కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి.
అదే క్రమంలో ఆదివారం ఇద్దరి మధ్య మళ్లి గొడవ జరిగింది. గొడవ పెద్దది కావడంతో శ్రీనివాసులు కూరగాయాలు కోసే కత్తితో యాదగిరిపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలై యాదగిరి (30) అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసు కున్న శంషాబాద్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్ఠం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
శ్రీనివాసులుతో పాటు మరో వ్యక్తిని ఆదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సీఐ ప్రకాశ్ రెడ్డి తెలిపారు.