ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
చట్టబద్ధతతో భవిష్యత్తులో సమస్యలు ఉండవు..
దత్తత వెళ్లిన పిల్లలపై శిశు సంక్షేమశాఖ పర్యవేక్షణ
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సంతానం కలగని దంపతుల కోరికను తీర్చేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల దత్తత ఇచ్చే ప్రక్రియను సులభతరం చేశాయి. గతంలో అమలులో ఉన్న మాన్యువల్ పద్ధతికి స్వస్తి పలికి ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో చట్టప్రకారం పిల్లలను దత్తత తీసుకునేందుకు దంపతులు అడుగులు వేస్తున్నారు. దత్తతపై ఐసీడీఎస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక వేత్తలు దంపతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆన్లైన్ పద్ధతిలో దత్తతకు అవకాశం ఉండడంతో జిల్లాలో ఎంతోమంది దంపతులు పిల్లల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇతర దేశాల్లో స్థిరపడిన వారు, జిల్లావాసులూ ఉన్నారు. పిల్లల దత్తతకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ cara.nic.in,లేదా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని caring. nic.in అనే వెబ్సైట్లలో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దత్తతపై ఎలాంటి సమాచారం కోసమైనా జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు.జిల్లాలో పిల్లల దత్తతకు మొత్తం 60 దరఖాస్తులు రాగా అధికారులు నాలుగు దరఖాస్తులను పరిష్కరించారు. నలుగురు పిల్లలను దత్తత ఇచ్చారు. మరో 54 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
నియమాలు ఇవీ..
పిల్లలను దత్తత తీసుకునే దంపతులు లేదా దత్తత తీసుకునే వ్యక్తి కచ్చితంగా ప్రభుత్వ నియమాలు పాటించాలి. దత్తత తీసుకునేవారి పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, నివాస ధ్రువపత్రాలు, కరెంట్ బిల్లు, ఆదాయానికి సంబంధించిన ప్లే స్లిప్స్, దత్తత తీసుకునే వారికి దీర్ఘకాలిక వ్యాధులు లేవని రుజువు చేసే వైద్యపరీక్షల పత్రాలు, దంపతుల వివాహ ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా అందించాలి. ఒంటరి స్త్రీలు మగ, ఆడ పిల్లల్లో ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు. మగవారు మాత్రం కేవలం మగపిల్లలనే దత్తత తీసుకోవాలి. ముగ్గురు అంతకంటే ఎక్కువ పిల్లలు ఉంటే వారికి దత్తత వర్తించదు.
దత్తత వెళ్లిన వారిపై పర్యవేక్షణ..
దత్తతకు వెళ్లిన పిల్లలపై ప్రభుత్వ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. విదేశాలకు వెళ్లినా వారు ఎలా పెరుగుతున్నారు? సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలను తెలుసుకుంటారు. వారి యోగక్షేమాలపై అడాప్షన్ సెంటర్లకు సమాచారం అందజేస్తారు. గతంలో ఖమ్మంలో మాత్రమే శిశు గృహ ఉండేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం భద్రాచలంలోనూ శిశు గృహ ఏర్పాటు చేసింది. ఈ శిశు గృహలో పది మంది పిల్లలు ఉండగా ఇటీవల నలుగురు దత్తతకు వెళ్లారు. ఇక్కడి కేంద్రం ఆరేళ్లలోపు అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నది.
అక్రమ దత్తత.. అనర్థాలకు మూలం..
అక్రమ పద్ధతిలో పిల్లల దత్తత మున్ముందు సమస్యలను తీసుకువస్తుంది. అక్రమ పద్ధతిలో దత్తత తీసుకుంటే పిల్లలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండదు. ఒకవేళ కుటుంబంలో పొరపొచ్చాలు వచ్చినా, దత్తత తీసుకున్న ఆ జంటకు తర్వాత పిల్లలు పుట్ట డం, దత్తత వచ్చిన పిల్లలపై ప్రేమ తగ్గడం, లేదా దంపతులు విడిపోవాల్సిన సందర్భాలు ఏర్పడినప్పుడు పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. కన్నప్రేమకు దూరమైన పిల్లలు పెంచుకుంటున్న తల్లిదండ్రులకు దూరమవుతారు. మానసిక సమస్యలు తలెత్తవచ్చు. అది జీవితంపై ప్రభావం చూపవచ్చు. ప్రైవేటు వ్యక్తులు, మధ్యవర్తుల ద్వా రా దత్తత తీసుకోవడం మరింత ప్రమాదం. పెద్దల తప్పిదాలకు అభం శుభం తెలియని చిన్నారులు బలికావాల్సి వస్తుంది.
దత్తతకు వెళ్లినా పిల్లలపై పర్యవేక్షణ ఉంటుంది..
చిన్నారుల సంరక్షణను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. దత్తతకు వెళ్లిన పిల్లలపై పర్యవేక్షణ తప్పనిసరిగా ఉంటుంది. పిల్లలు లేని దంపతులు చిన్నారులను ప్రభుత్వ నియమాల ప్రకారం దత్తత తీసుకోవాలి. అక్రమ దత్తత ఎప్పటికైనా సమస్యలను తెస్తుంది. దత్తతకు వెళ్లిన పిల్లల క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మేం తెలుసుకుంటాం.