బంజారాహిల్స్ : నిర్లక్ష్యంగా కారు నడిపి వీధి కుక్క మృతికి కారణమైన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 2న రాత్రి 7.30 గంటల సమయంలో అల్లూరి రాంచందర్రావు అనే వ్యక్తి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 78 నుంచి వేగంగా వెళ్తూ ఓ వీధి కుక్కను గుద్దేశాడు. ఈ ప్రమాదంలో ఆ కుక్క అక్కడికక్కడే మృతి చెందింది.
అదే సమయంలో ఈ దారిగుండా వెళ్తున్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ గమనించి ఖైరతాబాద్ జోన్ వెటర్నరీ విభాగం అధికారి మోహన్రెడ్డికి జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అర్వింద్ కుమార్ సూచనల మేరకు మోహన్రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపట్టి వీధి కుక్క మృతికి కారణమైన వ్యక్తిని అల్లూరి రాంచందర్రావుగా గుర్తించి ఆయనపై యానిమల్ కృయాలిటి యాక్ట్ తో పాటు ఐపీసీ సెక్షన్ 429, కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.