పెద్దవూర, నవంబర్ 26 : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఏర్పాటయ్యాయి నవోదయ విద్యాలయాలు. ఉమ్మడి జిల్లాకు ఒకటి వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా ప్రశాంత వాతావరణంలో విద్యనందిస్తున్నారు. పచ్చని చెట్లు, విశాలమైన తరగతి గదులు, భోజన వసతి, నిపుణులైన ఉపాధ్యాయులతో బోధన, ఆటపాటల్లో నైపుణ్యం కల్పించడం ఇక్కడ ప్రత్యేకత. నల్లగొండ జిల్లా చలకుర్తిలోని జవహర్ నవోదయ విద్యాలయం ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దింది.
1986లో ఏర్పాటు..
తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు 9 ఉంటే అందులో చలకుర్తి ఒకటి. సూమరు 54 ఎకరాల విస్తీర్ణంలో సకల సదుపాయాలతో ఉంది. ఈ పాఠశాలకు 6వ తరగతిలో ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. సీటు వచ్చిన విద్యార్థులకు 12వ తరగతి వరకు పూర్తిగా చదువుతోపాటు హాస్టల్ సౌకర్యం ఉచితం.
ఉదయం 5 నుంచే..
ఉదయం 5 గంటలకు కాలకృత్యాల అనంతరం వ్యాయామం ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థులకు బూస్ట్తో పాలు, రోజుకొక టిఫిన్, వారంలో మూడు సార్లు పండ్లు, మూడు సార్లు కోడి గుడ్లు, ఒక సారి మాంసాహారం అందిస్తారు. ఉదయం 7:20 నుంచి 1:30 పాఠశాలలో విద్యా బోధన, అనంతరం భోజన విరామం, సాయత్రం 3గంటల నుంచి 4:30 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. 4:30కు టీ, స్నాక్స్, 5 నుంచి 6 గంటల వరకు క్రీడలు ఉంటాయి. జిమ్ క్లాసులు, ఇద్దరు పీఈటీలతో వ్యాయామం. ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థుకు ఎన్సీసీలో శిక్షణ. ఎన్సీసీకి ప్రత్యేక ఆఫీసర్ ఉంటారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. విద్యా బోధన, సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిరోజూ కమలానెహ్రూ ఆస్పత్రి డాక్టర్లు వచ్చి క్యాంపస్లోనే విద్యార్థులకు వైద్యం అందిస్తారు. సంవత్సరంలో విద్యార్థికి రెండు జతల యూనిఫాంతోపాటు రెండు జతల షూ, బెడ్షీట్స్ అందిస్తారు. నెలకు సరిపడా సబ్బులు, కాస్మొటిక్స్ ఇస్తారు. విద్యార్థులు స్కూల్కు మొబైల్ తీసుకురావడానికి అనుమతి లేదు, తల్లిదండ్రులతో మాట్లాడానికి కాయిన్ ఫోన్ను ఏర్పాటు చేశారు.
ఉన్నతస్థానాలకు ఎంతో మంది..
ఇప్పటి వరకు ఎంతో మంది విద్యార్థులను ఈ పాఠశాల తీర్చిదిద్దింది. ఇక్కడ చదివిన వారిలో అనేకే మంది ఐఏఎస్, ఐపీఎస్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ద్యోగాల్లో స్థిరపడ్డారు.
6వ తరగతిలో ప్రవేశాలు..
చలకుర్తి నవోదయలో సీటుకు దరఖాస్తు చేసు కోవాలంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థులై ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదివి ఉండాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్ ఉంటుంది. మొత్తం సీట్లలో 33 శాతం అమ్మాయిలకు కేటాయిస్తారు. ఎంపిక విధానం ప్రవేశ పరీక్ష ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం 2021-22లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు, మే 1, 2009 నుంచి ఏప్రిల్ 30, 2013 మధ్య జన్మించిన వారై ఉండాలి.
ప్రత్యేకతలు
పాఠశాలలో మొత్తం విద్యార్థులు 492 మంది. సీబీఎస్ఈ విధానంలో విద్యా బోధన. సీసీ కెమెరా నిఘాలో స్కూల్ ఆవరణ ఉంటుంది. 40 మంది విద్యార్థులకు ఒక గది చొప్పున స్కూల్లో 14 తరగతి గదులు ఉన్నాయి. 15,000 పుస్తకాలతో కూడిన విశాలమైన లైబ్రరీ. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, మ్యాథ్య్స్కు ప్రత్యేక ల్యాబ్, 3 కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయి.
అడ్మిషన్లకు ఆహ్వానం
2022-2023లో 6వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 30 వరకు ఆఖరు తేదీ. www.navodaya.gov.in, httt;\www.jnvnalgonda.gov.in వెబ్సైట్ల నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి విద్యార్థి లేదా సంరక్షకుడి సంతకం చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థి చదువుతున్న పాఠశాల హెడ్మాస్టర్ సంతకం ఉండాలని ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు.