నారాయణపేట, జనవరి 2: దేశంలో రోజురోజుకూ విస్తరిస్తున్న ఒమిక్రాన్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒమిక్రాన్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ఈ నెల 10వ తేదీ వరకు పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారికి రూ. 1000 జరిమానా విధిస్తామన్నారు. పోలీస్స్టేషన్ల పరిధిలో ఆంక్షలు అమలయ్యేలా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా రవాణా నిర్వహణ సంస్థలు, దుకాణాల్లో, కార్యాలయాల నిర్వాహకులు ఆదేశాలకు కట్టుబడి ఉండాలన్నారు. ప్రాంగణాలను శానిటైజ్ చేయాలని, వినియోగదారులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలన్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్లు ధరించేలా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా మహమ్మారిని ప్రజలందరూ ఐక్యతతో ఎదుర్కొనేందుకు కృషి చేయాలని సూచించారు.
మాస్కు లేకుంటే రూ. వెయ్యి ఫైన్
మరికల్, జనవరి 2: ఒమిక్రాన్ నియంత్రణలో భాగంగా మరికల్ సర్కిల్ పరిధిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేవంలో సీఐ శివకుమార్ మాట్లాడుతూ మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపా యల జరిమానా విధిస్తున్నట్లు సీఐ తెలిపారు. అలాగే బహరంగ సభలు, ర్యాలీలు, మత, రాజకీయ, సాంస్కృతిక, సామూహిక సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాస్కులు ధరించి ఒమిక్రాన్ నుంచి రక్షణ విధించుకోవాలని సూ చించారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు.