హిమాయత్నగర్ : ఓ గప్చుప్ బండిలోని వస్తువులను దొంగిలించేందుకు ఓ యువకుడు ప్రయత్నించగా .. అడ్డుకోబోయిన వృద్ధుడిపై దాడికి పాల్పడిన యువ కుడిని నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై చందర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం చిక్కడపల్లిలో నివాసం ఉండే సాయితేజ (25) నారా యణగూడలోని వై ఎంసీఏ చౌరస్తాలో ఉన్న బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు.
సోమవారం తెల్లవారుజామున టీఎస్09 ఈయూ 6801 నెంబర్ గల వాహనంపై వచ్చి హిమాయత్నగర్ తెలుగు అకాడమీ సమీపంలో తన వాహనం నిలిపాడు. అక్కడే ఉన్న ఓ గప్చుప్ బండి తాళం పగులగొడుతుండగా అక్కడే నిద్రిస్తున్న యాచకుడు గమనించి కేకలు వేశాడు. ఊహించని పరిణామానికి ఖంగుతిన్న సాయి తేజ వృద్ధుడిపై కర్రలతో దాడి చేయడంతో అతడి తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.
ఆ దారి గుండా వెలుతున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని తీవ్రంగా గాయపడిన యాచకుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. నిందితుడు సాయితేజను అదుపులోకి తీసుకుని విచారించగా మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలింది. సాయితేజ నుంచి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఎస్సై చందర్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.