ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్ధాపురం గ్రామానికి చెందిన రైతు ఏనుగు మహేందర్రెడ్డి ఐదేండ్లుగా వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్నాడు. 3 ఎకరాల్లో బీర, కాకర సాగు చేస్తూనే అనుబంధంగా నాటుకోళ్లు సైతం పెంచుతున్నాడు.
3 ఎకరాల్లో బీర, కాకర సాగు కోసం రూ.లక్ష పెట్టుబడి పెట్టగా, రూ.3లక్షల లాభం పొందుతున్నాడు. బీర 40 రోజులు, కాకర 60 రోజులకు కాత కాస్తుంది. 90 రోజుల పాటు రోజు తప్పించి రోజు కాయలను కోసి హైదరాబాద్లోని బోయిన్పల్లి, ఉప్పల్ రైతు బజార్లతో పాటు ఇతర కూరగాయల మార్కెట్లకు తరలిస్తున్నాడు. కూరగాయల సాగుకు అనుబంధంగా ఎకరం స్థలంలో వంద నాటుకోళ్లను పెంచుతున్నాడు. దాంతో ప్రతి నెలా ఆదాయం వస్తున్నదని తెలిపాడు.
పంట మార్పిడితో ఎంతో మేలు..
పంట మార్పిడి విధానం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కూరగాయలు సాగు చేస్తే వరి కంటే అధిక ఆదాయం వస్తుంది. 3 ఎకరాల భూమిలో 5 ఏండ్లుగా బీర, కాకరకాయ సాగు చేస్తున్నాం. మరో 2 ఎకరాల్లో కూడా బీరతో పాటు టమాట సాగును చేపట్టేందుకు భూమిని చదును చేసి సిద్ధం చేశాం. ప్రభుత్వం ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించి సబ్సిడీలు అందించాలి. వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తే మంచి ఫలితం ఉంటుంది.