శ్రీరామకొండ జనసంద్రమైంది. మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో భక్తిపారవశ్యం తొణికిసలాడింది. ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చారు. ఎక్కడ చూసినా జనమే కనిపించారు. భక్తుల రామనామంతో కొండ పులకించిపోయింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రామపాదాన్ని భక్తులు దర్శించుకున్నారు. కొండపైకి కొత్తగా సీసీ రోడ్డు వేయడంతో ఉత్సాహంగా భక్తులు స్వామి సన్నిధికి చేరుకొని దర్శించుకున్నారు. క్షేత్రం ఆవరణలోని వనమూలికలను ఇండ్లకు తీసుకెళ్లారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు, ప్రముఖులు రాములోరిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సర్పంచ్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కోయిలకొండ, జనవరి2: పాలమురు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోయిల్కొండ మండల కేంద్రంలోని శ్రీరామకొండకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారం అమావాస్యను పురస్కరించుకోని శ్రీరామకొండకు భక్తులు పోటెత్తారు. కొండపై ఉన్న రెండు కోనేర్లలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఆదివారం ఉదయం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు భక్తులు రామపాదాన్ని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి ఆదేశాలతో కోయిలకొండ సర్పంచ్ కృష్ణయ్య తగిన ఏర్పాట్లు చేశారు. నూతనంగా కొండపైకి సీసీ రోడ్డు వేశారు. మహిమాన్వితమైన ఈ కొండపై వనమూలికలను భక్తులు తీసుకెళ్లారు. శ్రీరామ కొండ ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడింది.
రామపాదాన్ని దర్శించుకున్న పేట ఎమ్మెల్యే, ఎస్పీ
ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, మహబుబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు శ్రీరామకొండపై రామపాదాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆర్చకులు రాఘవేందర్రావు, రఘురామాచారి వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే తండ్రి రాజేశ్వర్ జ్ఞాపకార్థం భక్తులకు అల్పాహాం, తాగునీరు అందించారు.
రూ.కోటీ 50 లక్షలతో ప్రతిపాదనలు
శ్రీరామ కొండపై నూతనంగా ఆలయ నిర్మాణం చేపట్టడానికి పేట ఎమ్మెల్యే ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.కోటీ50లక్షల నిధులతో ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు.
గండి ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
మండలంలోని వింజమూర్ గ్రామంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి గండి ఆంజనేయస్వామి ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రామకొండ ఆలయ చైర్మన్ రవీందర్రెడ్డి, ఎంపీపీ శశికళా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, కోయిలకొండ సర్పంచ్ కృష్ణయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు శ్రీనివాస్రెడ్డి, ఎస్ఈ చంద్రమౌళితో పాటు భక్తులు, ప్రజాప్రతినిధులు, శ్రీరామయువసేన కార్యకర్తలు పాల్గొన్నారు.