ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కాంటాలు
నిబంధనల మేరకు వేగంగా పూర్తికి చర్యలు
నిరంతర పర్యవేక్షణ, ఆటంకాలపై తక్షణ స్పందన
సమన్వయంతో అన్ని విభాగాలు ముందుకు..
సాధ్యమైనంత వేగంగా పూర్తికి కసరత్తు
సీఎంఆర్ సేకరణలో కేంద్రం నిర్లక్ష్యం
నల్లగొండ ప్రతినిధి, నవంబర్29(నమస్తే తెలంగాణ) :వానకాలం ధాన్యం దిగుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనుగోళ్లు సాగుతున్నాయి. అన్ని కేంద్రాల్లోనూ కాంటాలు, ఎగుమతులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆటంకాల్లేకుండా చూసుకుంటున్నారు. వరుస తుఫాన్లతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నా సాధ్యమైనంత త్వరగా, సజావుగా కొనసాగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షాలు కరిసి, ధాన్యం తడిసిన సమయంలోనూ రైస్మిల్లర్లతో చర్చించి తేమ శాతం విషయంలో సానుకూలంగా వ్యవహరించేలా ఒప్పిస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో యాసంగి సీజన్తో పోలిస్తే వానవాలం దిగుబడుల్లో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. వానకాలంలో దొడ్డు బియ్యంతోపాటు సన్నాల సాగూ భారీగానే ఉంటుంది. దీంతో సన్నాలకు నేరుగా బహిరంగ మార్కెట్లో మంచి ధరతో మిల్లర్లు, లేదంటే వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. రైతులంతా ఒకేసారి ఎగబడడంతో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు వచ్చినా.. ఓపికగా ఉన్న రైతులకు ప్రస్తుతం క్వింటాకు మార్కెట్లో రూ.2100 నుంచి 2300 వరకు ధర పలుకుతుండడం విశేషం. సన్నాల కొనుగోలు విషయంలో దాదాపు సమస్యలు తొలగిపోయినట్లే. ఇక మిగిలినదల్లా దొడ్డురకం ధాన్యం కొనుగోళ్లే. వీటిని రెండు సీజన్లలోనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ వస్తున్నది. ఈ వానకాలంలోనూ దొడ్డురకం కొనుగోళ్ల కోసం గత నెల ఆరంభం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఐకేపీ, పీఏసీఎస్, మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు కేంద్రాలను దశలవారీగా ఏర్పాటు చేసింది. వీటి ద్వారా కొనుగోళ్లు మొదలయ్యాయి.
ప్రతికూల పరిస్థితుల్లోనూ..
కొనుగోళ్లు ఊపందుకునే సమయంలోనే ఈ సీజన్లో ప్రకృతి పరంగా తీవ్ర ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా తుఫాన్ల ప్రభావంతో ధాన్యం కొనుగోళ్లలో ఆటంకాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే. మళ్లీ ఆది, సోమవారాల్లోనూ వాతావారణం పూర్తిగా తేమతో కూడి చిరుజల్లులు కురిశాయి. దీంతో ధాన్యంలోనూ తేమశాతం అధికంగా వస్తుంది. ఈ పరిస్థితుల్లోనూ నిరాటంకంగా కొనుగోళ్లు జరుపాలన్న లక్ష్యంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కాంటాలు వేస్తూ.. ఆ వెంటనే అక్కడి నుంచి మిల్లులకు తరిలిస్తున్నారు. యాసంగి ధాన్యం సీఎంఆర్ను సేకరించడంలో ఎఫ్సీఐ నిర్లక్ష్యం చేస్తుండడంతో గోదాముల్లో స్థల సమస్య ఏర్పడుతుంది. దీన్ని కూడా రైస్మిల్లర్లతో చర్చిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతోపాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ చేస్తూ రైతులకు డబ్బులు చెల్లించేలా చర్యలు చేపడుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు 204 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నారు. వీటి ద్వారా ఇప్పటివరకు 18,578 మంది రైతుల నుంచి 1.33లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 1.31లక్షల మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.261కోట్లుగా ఉంది.
ఇందులో రూ.107కోట్ల విలువైన ధాన్యం ట్యాబ్ ఎంట్రీ కాగా చెల్లింపులపైనా చర్యలు తీసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 6,592 మంది రైతుల నుంచి రూ.88 కోట్ల విలువైన 45,066 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిపారు. 228 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎక్కువ భాగం సన్నాలు సాగు కాగా వీటి కొనుగోళ్లు దాదాపు పూర్తికావచ్చాయి. సన్నాల కొనుగోలులో ప్రస్తుత ఇబ్బందులు లేవు. వ్యాపారులే పోటీ పడి ధర పెడుతుండడంతో రైతులకు ప్రయోజనకరంగా మారింది. ఇక యాదాద్రిభువనగిరి జిల్లాలోనూ కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. మొత్తం 279 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 58,024 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో 52వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే మిల్లులకు తరలించారు. మిగతా ధాన్యం కొనుగోళ్లపైనా నిరంతరం రివ్యూలతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. డిసెంబర్ నెలాఖరుకు ఈ కొనుగోళ్లు కొనసాగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే కొనుగోళ్లలో మరింత వేగం పెంచవచ్చని చెబుతున్నారు. ఎండ రాకపోవడం, చిరుజల్లులతో ధాన్యంలో తేమ శాతం నిర్దిష్టంగా ఉండడం లేదు. దీంతో కొనుగోళ్లు చేసే సమయంలో సాంకేతికంగా ఆటంకం కలుగుతుంది. తేమశాతం సరిగ్గా లేకపోతే సీఎంఆర్ సమయంలో బియ్యం తక్కువగా వస్తే మిల్లర్ల్లు నష్టపోయే అవకాశం ఉంది. తేమశాతం విషయంలో నిర్దిష్ట ప్రమాణాలను పాటించక తప్పడం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే సాధ్యమైనంత వేగంగా కొనుగోళ్లు జరుపవచ్చని భావిస్తున్నారు.
సీఎంఆర్ పైనా దృష్టి
ఓ వైపు కొనుగోళ్లను కొనసాగిస్తూనే మరోవైపు యాసంగి ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ వేగవంతంపైనా చర్యలు చేపడుతున్నారు. సీఎంఆర్ను ఎప్పటికప్పుడు పూర్తి చేయడం వల్ల గోదాముల సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ నేపథ్యంలోనే యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ఎఫ్సీఐకి అప్పజెప్పడంపై అధికారులు దృష్టి పెట్టారు. సీఎంఆర్ బియ్యాన్ని మిల్లుల నుంచి ఎఫ్సీఐ గోదాములకు తరలించాలంటే అక్కడ ఖాళీ లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైల్వే ర్యాక్లను కేటాయిస్తే గోదాములు ఖాళీ కానున్నాయి. కానీ ర్యాక్ల కేటాయింపులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గోదాములు ఖాళీగా లేకపోవడంతో సీఎంఆర్ను అప్పగించడంలో ఆలస్యం జరుగుతుంది. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం నుంచి మొత్తం 5.79లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్గా ఇవ్వాల్సి ఉండగా నేటి వరకు 3.88లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ను పూర్తి చేశారు. ఇది మొత్తం టార్గెట్లో 62శాతంగా ఉంది. నెలకు 30 రైల్వే ర్యాక్స్ రావాల్సి ఉండగా కేవలం 15 ర్యాకులే వస్తుండడంతో సీఎంఆర్ ఆలస్యమవుతున్నది. ఇక సూర్యాపేటలో 4.54లక్షల మెట్రిక్ టన్నులకు 31.13శాతంతో 1.41లక్షల సీఎంఆర్ను పూర్తి చేశారు. యాదాద్రిలో 2.86లక్షల మెట్రిక్ టన్నులకు 43.78శాతంతో 1.25లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని సేకరించారు. సీఎంఆర్ బియ్యాన్ని వెంటనే మిల్లుల నుంచి ఎఫ్సీఐ సేకరిస్తే వానకాలం కొనుగోళ్లకు గోదాముల్లో స్థల సమస్య ఎదురయ్యేది కాదని అధికారులు పేర్కొంటున్నారు.
నిరంతర సమీక్షలతో చర్యలు : ఏసీ
వానకాలం ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ సూచనల మేరకు వేగంగా జరిగేలా చూస్తున్నాం. కొనుగోళ్లకు సంబంధం ఉన్న అన్ని విభాగాలను సమన్యయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఎక్కడైనా ఆటంకాలు కలిగితే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. నిరంతరం సమీక్షలు జరుపుతూ, క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ రైతులతో నేరుగా చర్చిస్తున్నాం. తుఫాన్ల ప్రభావంతో వాతావరణం ప్రతికూలంగా మారుతుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రమాణాల మేరకు కొనుగోళ్లు కొనసాగిస్తున్నాం.