బీడీఎల్ విన్నర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రఘు హామీ
నాలుగు నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల అందజేత
నమస్తే తెలంగాణ కథనం మనస్సుకు తాకిందని వెల్లడి
సంస్థాన్ నారాయణపురం, నవంబర్29 : చిన్నతనంలోనే తండ్రిని కొల్పోవడంతో పాటు 11ఏండ్లుగా మంచానికే పరిమితమైన తల్లికి సపర్యలు చేస్తూ శిథిలావస్థలో ఉన్న గుడిసెలో కాలం వెల్లదీస్తున్న కల్పన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని బీడీఎల్ విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆరికపూడి రఘు హామీనిచ్చారు. సోమవారం ఆయన సంస్థాన్నారాయణపురం మండలం గుజ్జ గ్రామానికి వెళ్లి కల్పనను, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లిని పరామర్శించారు. ఆయన రెండు నెలల్లో ఇల్లు నిర్మించి ఇస్తానని ధైర్యంగా ఉండాలని సూచించారు. నాలుగు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురితమైన ‘అంతులేని కథ’ కథనం తనను కదిలించిందని తెలిపారు.
రూ.10వేలు సాయం చేసిన నందికొండ ఫౌండేషన్
చండూరు మండలం నెర్మట గ్రామానికి చెందిన నందికొండ ఫౌండేషన్ అధ్యక్షురాలు నందికొ ండ గీతారెడ్డి సోమవారం కల్పన ఇంటికెళ్లి 10వేల ఆర్థిక సాయం అందించారు. ఫౌండేషన్ తరపున కల్పనకు అండగా ఉంటామని తెలిపారు. ఆమె వెంట కొమ్మిడి శోభారెడ్డి, నూకల పద్మారెడ్డి, గంగసాని త్రివేణిరెడ్డి, కందాల సౌమ్య, గ్రామ సర్పంచ్ మైల యాదవరెడ్డి ఉన్నారు.
‘నమస్తే’ కథనానికి స్పందించి ఇప్పటికే అమెరికా ప్రవాస భార తీయుడు సత్యనారాయణ కల్పన బ్యాంక్ అకౌంట్లో రూ.10వేలు జమ చేయగా, గుజ్జ గ్రామానికి చెందిన దోడ శ్రీనివాస్రెడ్డి కుమారుడు సిద్ధార్థరెడ్డి(3వ తరగతి) తన కిడ్డీ బ్యాంకు డబ్బులు రూ.15వేలు ఇస్తానని ప్రకటించాడు.