బీపీ, షుగర్ పేషెంట్లకు ఊరట
రేపటి నుంచి కమ్యూనల్ డిసీజెస్ కిట్ల పంపిణీ
ముందుగా 80ఏండ్ల పైబడిన వారికి..
నడి వయస్సు వారికి సబ్ సెంటర్లలో అందజేత
ఉమ్మడి జిల్లాలో 2,15,860 మందికి ప్రయోజనం
నీలగిరి, నవంబర్ 29 : ప్రజారోగ్యమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలను అందిస్తున్నది. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి డిసెంబర్ 1 నుంచి నాన్ కమ్యునల్ డిసీజెస్(ఎన్సీడీ) కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. సబ్సెంటర్ల వారీగా ఈ మం దులను అందజేయనున్నారు. నెల రోజులకు సరిపడా మందులను అందించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నది. ముందుగా 80 ఏండ్ల పైబడిన వారికి ఆశ కార్యకర్తల ద్వారా డోర్ డెలివరీ చేయడంతోపాటు 30 ఏండ్లు పైబడిన వారికి సబ్ సెంటర్ల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అంతే కాకుండా మరింత ఆరోగ్యవంతంగా జీవించేందుకు సూచనలు ఇవ్వనున్నారు.
2.15 లక్షల మందికి లబ్ధి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,15,860 మంది షుగర్, బీపీతో బాధపడుతున్నట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా నల్లగొండజిల్లాలో బీపీతో 69,321, షుగర్తో 49,124 మంది బాధపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 40 లక్షల జనాభా ఉండగా జిల్లా వ్యాప్తంగా 561 సబ్ సెంటర్లు, అందులో 213 పల్లె దవాఖానలను ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు.
సబ్ సెంటర్ల టెస్టులు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి సబ్ సెంటర్లో వివిధ రకాల వ్యాధులకు సంబంధించి టెస్టులు చేయనున్నారు. అందులో 30 ఏండ్లు పైబడిన వారు 37శాతం ఉంటారని అంచనా. దీంతో అధికారులు గ్రామ స్థాయి నుంచి సర్వే చేపట్టనున్నారు. వీరందరికీ బీపీ, షుగర్ పరీక్షలతో పాటు క్యాన్సర్ లక్షణాలపై సర్వే కొనసాగనుంది. ఈ సర్వేకు సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు డేటాషీట్ ఆందజేస్తారు. వాటి ఆధారంగా సబ్ సెంటర్లకు వచ్చే వా రిని వివరాలు అడిగి తెలుసుకుంటారు. ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యాధికారికి తెలియజేస్తారు.
పేదలకు మేలు చేసే నిర్ణయం..
బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేయడంతో పేదలకు మేలు కలుగనున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధిగ్రస్తులు డబ్బులున్నప్పుడే మందులు కొనుగోలు చేయడం, నిత్యం వేసుకోకపోవడంతో దుష్పరిణామాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నెలకు సరిపడా మందులు అందజేయడంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ వ్యాధులు నియంత్రణలో ఉండడంతో ఇతర వ్యాధులు సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఎన్సీడీ కిట్ల పంపిణీ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.