మాదాపూర్ పీఎస్లో ఈ ఏడాది 800 ఫిర్యాదులు
ట్రాక్ చేసి 400 ఫోన్లు రికవరీ
సెల్ దొరకడంతో బాధితుల ఆనందబాష్పాలు
పోలీసులకు కృతజ్ఞతలు
సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): సెల్ఫోన్ జీవితంలో ఓ భాగంగా కాదు.. ప్రాణంగా మారిపోయింది. వాటిని పొగొట్టుకున్న వారు తిండి, నిద్రలను కూడా కోల్పోతున్నారు. దానిని తిరిగి పొందేందుకు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రతి బాధితుడి ఆవేదనలో ఓ మానవీయ కోణం ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్లకు సెంటిమెంట్ కూడాఉండడంతో పోయినఫోన్లు దొరికేంత వరకు పోలీస్స్టేషన్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. హైదరాబాద్లో అత్యంత బిజీ బిజీగా ఉండే ఐటీ కారిడార్ ప్రాంతంలోని మాదాపూర్ పోలీస్స్టేషన్లో ఈ ఏడాది దాదాపు 800 మొబైల్ ఫోన్లు పోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల్లో వారికి ఉన్న సెంటిమెంట్, వాటి కొనుగొలుకు వారు పడ్డ కష్టాలు, అందులో ఉన్న జ్ఞాపకాల గురించి తెలుసుకుని మాదాపూర్ పోలీసులు దాదాపు 400 ఫోన్లను ట్రాక్ చేసి తిరిగి వారికి అప్పగించారు. మిగతా వాటి కోసం ఇంకా ప్రయత్నిస్తున్నారు. చక్కర్లు కొడుతున్న బాధితులకు మీ ఫోన్ గ్యారంటీగా మీకు అప్పజెప్పడానికి ప్రయత్నిస్తున్నామని భరోసా ఇస్తున్నారు.
ఐఎంఈఐ నెంబరు ఉండాల్సిందే..
ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయాలనుకున్న వారు కచ్చితంగా ఐఎంఈఐ నెంబరుతో ఫిర్యాదు చేయాలి. ఆ నెంబరు ఉంటేనే పోయిన ఫోన్ను ట్రాక్ చేయొచ్చు. ఒకసారి చోరీకి గురైన ఫోన్ ఇతరులకు దొరికినా వాటిని స్విచ్ ఆఫ్ చేసి పాత సిమ్ను తీసేసి కొత్త సిమ్ వేసుకున్నా వాటిని పట్టుకునే అవకాశం ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా ట్రాక్ చేయవచ్చు. ఫోన్ను రికవరీ చేసి బాధితుడికి అప్పగించవచ్చు.
నా ఆవేదనే సేవకు మార్గమైనది
కొన్ని సంవత్సరాల కిందట నా పనిని మెచ్చుకుని ఓ అధికారి, నా గురువు ఓ కొత్త ఫోన్ను బహుమతిగా ఇచ్చారు. కొద్ది రోజులు వాడిన తర్వాత ఆ ఫోన్ పోయింది. అపుడు నాలో కలవరం అంతా ఇంతా కాదు. గురువు గారు ఇచ్చిన ఫోన్ను పొగొట్టుకున్నాను అని తెగ బాధపడ్డాను. నేనే స్వయంగా ఫోన్ను ట్రాక్ చేసి పట్టుకోవడానికి 25 రోజులు పట్టింది. ఆ 25 రోజులు పడిన ఆవేదన నాకు ఇంకా గుర్తుంది. నాలుగు రోజులు భోజనం కూడా చేయలేదు. నేను పడిన బాధ మరొకరు పడకూడదని ఫోన్ పోయిందని వచ్చే బాధితులకు సాయపడుతున్నాను. నా వంతుగా ప్రతి ఫిర్యాదును తీసుకుని వెతికి ఇచ్చే విధంగా ప్రయత్నిస్తున్నాను. ఫోన్ ఇచ్చేటపుడు వారి ముఖంలో ఆనందం చూస్తే నాకు చాలా సంతోషమేస్తుంది.
నాగలక్ష్మి.. ఓ మధ్యతరగతి మహిళ. భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నది. కరోనా కారణంగా పిల్లలకు ఆన్లైన్ తరగతులు నడుస్తున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా పిల్లల భవిష్యత్ కోసం రూపాయి రూపాయి జమచేసి స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నది. కుటుంబసభ్యులతో కలిసి బస్సులో ప్రయాణిస్తుండగా ఫోన్ పోయింది. కష్టపడి కొన్న ఫోన్ కనిపించకపోవడంతో కన్నీళ్లు ఆగలేదు. బోరున ఏడ్చేసింది. కుదటపడ్డాక పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫోన్ను తిరిగి ఇచ్చారు. ఇప్పుడు ఆమె పిల్లలు హాయిగా ఆన్లైన్ తరగతులు వింటున్నారు.